తెలంగాణకు నేడు రూ.1,600 కోట్ల నగదు: తెర్చుకోనున్న ఏటీఎంలు
తెలంగాణలో నగదు కష్టాలకు కొంత ఉమశమనం కలగనుంది. ఎందుకంటే.. రాష్ట్రానికి రిజర్వు బ్యాంకు నుంచి రూ.1,600 కోట్ల నగదు రానున్నట్లు తెలిసింది.
హైదరాబాద్: తెలంగాణలో నగదు కష్టాలకు కొంత ఉమశమనం కలగనుంది. ఎందుకంటే.. రాష్ట్రానికి రిజర్వు బ్యాంకు నుంచి రూ.1,600 కోట్ల నగదు రానున్నట్లు తెలిసింది. ఈమేరకు గురువారం ఆర్బీఐ నుంచి ఆర్థికశాఖకు సమాచారం అందింది. జీతాలు ఇచ్చే ఒకటో తేదీ వచ్చేయడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరికీ నగదు అవసరం బాగా పెరిగింది.
తమ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయినా కూడా.. వాటిని పొందలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. అంతేగాక, ఉద్యోగులకు, పింఛనుదార్లకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున నగదు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరటంతో ఇప్పుడు బ్యాంకులపై మరింత ఒత్తిడి పెరిగింది.
కాగా, నగదు అందుబాటులోకి వచ్చినట్లైతే ఉద్యోగులకు, పింఛనుదార్లకు రూ.10వేల చొప్పున లభించడంతో పాటు ఏటీఎంలు తెరుచుకొనే అవకాశముంటుంది. రాష్ట్రంలో గురువారం అత్యధిక ఎటీఎంలను తెరవనేలేదు. తెలంగాణ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు బుధ,గురువారాల్లో బ్యాంకుల అధికారులతో భేటీ అయి నగదు లభ్యతపై చర్చించినట్లు తెలిసింది.
సమస్యలను ఆర్బీఐకి నివేదించడంతో రాష్ట్రానికి శుక్రవారం రూ.1600 కోట్లు నగదును పంపుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. జీతాలు, పింఛన్లు పొందేవారు హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నందున రూ.600 కోట్లను ఇక్కడి బ్యాంకులకు అందజేస్తారు. మిగతా రూ.వెయ్యి కోట్లు జిల్లాల బ్యాంకులకు వెళ్తాయి.