తెలంగాణలో కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు.. ఒకరు మృతి..
తెలంగాణలో శనివారం(మే 2)న కొత్తగా మరో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1061కి చేరుకుంది. మొత్తం మృతుల సంఖ్య 29కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రంలో ఆరు రోజుల పాటు కరోనా కేసుల సంఖ్య సింగిల్ డిజిట్కు పడిపోయింది. అయితే గురువారం ఒక్కరోజు డబుల్ డిజిట్(22) కేసులు నమోదయ్యాయి. అప్పటినుంచి మళ్లీ సింగిల్ డిజిట్ కేసులే నమోదవుతూ వస్తుండగా.. శనివారం మాత్రం మరోసారి డబుల్ డిజిట్కు చేరింది.
ఇదిలా ఉంటే,ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం ఇక్కడి వైద్య సదుపాయాలు,కరోనా టెస్టులు,ప్రోటోకాల్స్పై సంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అవసరమైన చర్యలు తీసుకుంటోందని కేంద్ర బృందం పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదికలతో కేంద్ర బృందాన్ని తప్పుదోవ పట్టించిందని రాష్ట్ర బీజేపీ చీఫ్,ఎంపీ బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. వాస్తవాలను తెలుసుకునేందుకు మరో బృందాన్ని రాష్ట్రానికి పంపించాలని ఆయన కేంద్రానికి లేఖ కూడా రాశారు. టెస్టులు తక్కువగా చేయడం వల్లే రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని ఆయన ఆరోపించారు.