17 ఏళ్ల యువతి మృతి: 2 కారణాలు.. సొంతవాళ్లే రేప్ చేసి, చంపేశారా?
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో 17 ఏళ్ల అమ్మాయి సాహితి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె బాత్ రూంలో కాలు జారి పడటం వల్ల చనిపోయిందని మేనత్త, మామ చెబుతుండగా, ఆస్తి కోసం అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
17 ఏళ్ల సాహితికి తల్లిదండ్రులు మృతి చెందారు. దీంతో ఆమె మేడిపల్లిలోని తన మేనత్త ఇంటి వద్ద ఉంటోంది. ఆమె నిన్న (సోమవారం) సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
బూత్ రూంలో కాలు జారడం వల్ల ఆమె కింద పడిందని, దీంతో మృతి చెందిందని ఆమె బాగోగులు చూసుకుంటున్న మేనత్త, మామలు చెబుతున్నారు. ఆమె అత్త కూడా అదే విషయం చెబుతోంది.
అత్యాచారం చేసి, హత్య చేశారని అనుమానం
మేనత్త, మామ, అలాగే బాధితురాలి బావ పైన పలువురు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఆస్తి కోసమే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
సాహితి చిన్నమ్మ ఓ ఛానల్తో మాట్లాడుతూ... గత పది రోజులుగా సాహితి తన వద్దకు, ఇతర బంధువుల ఇళ్లకు వచ్చి తినేదని చెప్పింది. ఎందుకు అని అడిగితే వాళ్లు పెట్టే బాధలు పడలేక వస్తున్నట్లు చెప్పిందని చిన్నమ్మ చెప్పింది. బావనే చంపేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. గతంలోను దాడి జరిగిందని చెప్పింది.
సాహితి చిన్నాన్న మాట్లాడుతూ.. సాహితి అత్త కూతురుకు ఎవరితోనే కాంటాక్ట్స్ ఉన్నాయని తెలిసిందని, కారు డ్రైవర్ను పెళ్లి చేసుకుందని తెలిసిందని, ఈ విషయం సాహితికి తెలియడంతో ఆమె బయట పెడుతుందనే ఉద్దేశ్యంతో నిత్యం వేధించే వారని అతను చెప్పాడు. తమ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కడ బయటపడతాయోనని వారు భయపడ్డారన్నారు.
రెండు కారణాలు..
సాహితికి రూ.కోటిన్నర వరకు ఆస్తి ఉందని, అందులో 14 ఎకరాల భూమి ఉందని చెప్పారు. మరికొద్ది రోజుల్లో ఆమె మేజర్ అవుతుందన్నారు. ఆమె మేజర్ అయితే ఆస్తి మొత్తం ఆమెకు వెళ్తుందనే కారణంతో చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే తమ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎవరికైనా చెబుతారనే అనుమానంతోను రేప్ హత్య చేసి ఉంటారన్నారు. బావ పైన అనుమానం ఉందన్నారు.
మెడ భాగంలో గాయం
సాహితి బాత్రూంలో జారి పడినట్లుగా చెబుతున్నారని, కానీ ఆమె తల వెనుక వైపున కింది భాగంలో గాయమైనట్లుగా తెలుస్తోంది. అలాగే తాడుతో బిగించినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, సాహితి బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సాహిత పేరుతో ఆస్తులతో పాటు ఆమె తండ్రి పేరుతో కూడా స్థలాలు ఉన్నాయి.