ఇంట్రెస్టింగ్ : 18 ఓట్లకే సర్పంచ్.. 5 ఓట్లకే వార్డుమెంబర్.. ఎందుకో తెలుసా?
Recommended Video
ఖమ్మం : ఎన్నికల్లో ఓట్ల లెక్కలు గమ్మత్తుగా ఉంటాయి. ఒక్క ఓటుకు కూడా చాలా విలువుంటుంది. ఒకే ఒక్క ఓటుతో ఓటమిపాలయినోళ్లు ఉన్నారు. 5, 10 ఓట్లతో గెలిచినోళ్లూ ఉన్నారు. ఇదంతా ఎందుకంటారా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో 18 ఓట్లు వస్తే చాలు.. ఆ ఊరికి సర్పంచ్ గా ఎన్నిక కావొచ్చు. కేవలం 18 ఓట్లకే సర్పంచ్ గిరి దక్కుతుందా అని అనుకుంటున్నారా? ఇది ముమ్మాటికీ నిజం.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల వేళ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చాలాచోట్ల వింత వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఆ క్రమంలో 5 ఓట్లకే వార్డుమెంబర్లు.. 18 ఓట్లకే సర్పంచ్ పదవులు కట్టబెట్టే గ్రామాలున్నాయనే విషయం వైరల్ గా మారింది.
ప్రత్యర్థికన్నా 8 ఎక్కువొస్తే చాలు
ఆళ్లపల్లి మండలం దొంగతోపు గ్రామ జనాభా 106 మంది. అందులో ఓటర్ల సంఖ్య కేవలం 34 మాత్రమే. అక్కడ సర్పంచ్ గా బరిలో నిలిచినవారికి 18 ఓట్లు వస్తే చాలు ఆ కుర్చీ దక్కినట్లే. ఇక అపొజిషనోళ్లకు 10 ఓట్లు వస్తే గట్టి పోటీ ఉన్నట్లే. ప్రత్యర్థికన్నా 8 ఓట్లు ఎక్కువొస్తే చాలు.. ఆ ఊరి సర్పంచ్ కుర్చీ ఎక్కినట్లే. తక్కువ జనాభా కారణంగా కేవలం 18 ఓట్లకే సర్పంచ్ కావడం ఆ గ్రామం ప్రత్యేకత.
మంత్రివర్గ విస్తరణకు మరో గండం.. ఫిబ్రవరి వరకు కొత్త అమాత్యులకు నో ఛాన్స్
5కే వార్డుమెంబర్..!
అదలావుంటే ఆ ఊరిని భాగాలుగా విభజించి 4 వార్డులుగా రూపొందించారు. వార్డు మెంబర్ కావాలనుకునేవాళ్లకు కేవలం 5 ఓట్లు వస్తే చాలు వారి పంట పండినట్లే లెక్క. ఒకవేళ సర్పంచ్ పదవికి ముగ్గురు గనక పోటీలో ఉంటే.. 10 ఓట్లు సాధించినోళ్లే సర్పంచ్ గా ఎన్నికయ్యే ఛాన్సుంది. మొత్తానికి ఆ ఊరిలో ఒక్కో ఓటు కీలకంగా మారుతుందన్నమాట. అంతేకాదు ప్రచారం హడావిడి కూడా పెద్దగా అవసరం లేదు. 20-30 మందిని కలవడం పెద్ద పని కాకపోయినప్పటకీ.. ఏ ఓటరూ ఎటువైపు మొగ్గుచూపుతాడో తెలియని పరిస్థితి.
కుర్చీలాట..!
ఇక అదే మండలానికి చెందిన అడవిరామం అనే ఊరిలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఆ గ్రామ జనాభా 170 మంది ఉండగా.. ఓటర్లు 64 మంది ఉన్నారు. సర్పంచ్ గా ఎన్నికవ్వాలంటే 33 ఓట్లు పొందాల్సి ఉంటుంది. ఇదీ ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉంటే వర్తిస్తుంది. అదే ముగ్గురు నలుగురు గనక బరిలో నిలిస్తే పద్దెనిమిదో ఇరవయ్యో వస్తే సర్పంచ్ కుర్చీ దక్కుతుంది.