ఉద్యమ పార్టీకి 18 ఏండ్లు..! సాదాసీదాగా ఆవిర్బావ ఉత్సవాలు..!!
హైదరాబాద్ : ఉక్కు సంకల్పం లాంటి ఆ ఉద్యమం చరిత్రపుటల్లో శాశ్వత చోటు కల్పించుకుంది. అసాద్యమని అవహేళన చేసిన వారి పట్ల సింహస్వప్నంలా పరిణమించి, తెలంగాణ జాతికి స్వేచ్చా వాయువులను అందించింది. పిడికెడు జనంతో మొదలైన ఆ ఉద్యమం ఆకాశమంత ఎగసిపడి., ప్రళయకాల రుద్రుడిలా గర్జించి శత్రువు గెండెల్లో గుణపం దింపింది. దీంతో తెలంగాణ కల సాకారమైంది. జనం జీర్ణించుకోలేక పోయినా, విధి వికటాట్టహాసం చేసినా, ప్రక్రుతి పగబట్టినా, పట్టు సడలకుండా ఉద్యమాన్ని ఉరకలెత్తించి అనుకున్నది సాధించిన ధీరోదాత్తుడుగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ పుడమిపై చెరగని ముద్రవేసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరైన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్బవించి 18 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా వన్ ఇండియా ప్రత్యేక కథనం..!
గులాబీ పార్టీకి 18 ఏళ్లు..! నిరాడంబరంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం..!!
తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఎంతో కీలమైన ఉద్యమంగా భావిస్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారని చెప్పొచ్చు. ఎన్ని అవరోధాలెదురైనా, రాజకీయ పార్టీలు సహకరించకపోయినా, కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు స్రుష్టించినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పార్టీని ముందుకు నడిపించి అనుకున్న కల సాకారం చేసారు కల్వకుట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ ఉద్యమానికి కీలకంగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్బవించి 18సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులులేకుండా పోయింది. అయితే పార్టీ ఆవిర్బావ ఉత్సవాలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని పార్టీ కార్యనిర్వాహక అద్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో టీఆర్ఎస్ వినూత్న నిర్ణయం..!హంగూ ఆర్బాటం అవసరం లేదన్న కేటీఆర్..!!
ఈనెల 27న జరుగనున్న టీఆర్ఎస్ 18వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు గురువారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ జెండాలను ఆవిష్కరించాలన్నారు. వివిధ స్థాయిల్లో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన సూచించారు.
జెండాలు ఆవిష్కరించాలి..! తెలంగాణ భవన్ కి కేటీఆర్..!!
పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని నేతలు, కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలోని పార్టీ బాధ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. తెలంగాణ భవన్లో జరగనున్న పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారు.
కాళేశ్వరం ఓ అద్బతం..! తెలంగాణకు అదే కీలక మైలురాయన్న కేటీఆర్..!!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి పంపు వెట్రన్ విజయవంతం కావడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఖరీఫ్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంలో ఈ ప్రక్రియ కీలకమైందని పేర్కొన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించే భారీ ప్రణాళికలో ఇదో కీలక మైలురాయిగా కేటీఆర్ అభివర్ణించారు. లక్షల మంది రైతుల సుదీర్ఘ ఎదురుచూపులకు తెరపడనుందని గురువారం ట్విట్టర్లో పేర్కొన్నారు.