1831 పాజిటివ్ కేసులు నమోదు, గ్రేటర్ పరిధిలోనే 1419 పాజిటివ్ కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కనీసం 1500 పైచిలుకు కేసులు రోజు నమోదవుతున్నాయి. సోమవారం కూడా 1831 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 6 వేల 383 మంది శాంపిల్స్ పరీక్షించగా 1831 మందికి వైరస్ సోకింది. వైరస్ సోకి 11 మంది చనిపోయారు. చనిపోయిన వారి సంఖ్య 306కి చేరింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కూడా 25 వేలు దాటింది. లక్ష 22 వేల 218 నుంచి రక్త నమూనాలు సేకరించగా.. 25 వేల 733 మందకి కరోనా పాజిటివ్ సోకింది.
గత 24 గంటల్లో 2078 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వైరస్ జయించిన వారి మొత్తం సంఖ్య 14,781కి చేరింది. ప్రస్తుతం 10,646 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1419 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 160 మంది, మేడ్చల్లో 117 మందికి కరోనా పాజిటివ్ సోకిందని బులెటిన్లో వైద్యారోగ్యశాఖ తెలిపింది. శనివారం 1850 పాజిటివ్ కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం 1500 వరకు కేసులు వచ్చాయి. మళ్లీ సోమవారం ఒక్కసారిగా కేసులు పెరిగాయి.