1879 పాజిటివ్ కేసులు నమోదు, గ్రేటర్ పరిధిలోనే 1422 పాజిటివ్ కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకి వైరస్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న 1831 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇవాళ 1879 కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 6 వేల 220 శాంపిల్స్ సేకరించగా.. 1879 మందికి వైరస్ సోకింది. వీరితో కలుపుకొని కరోనా వైరస్ సోకిన మొత్తం కేసుల సంఖ్య 27 వేల 612కి చేరింది. మంగళవారం కరోనా వైరస్ సోకి ఏడుగురు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 313కి చేరింది.
మంగళవారం 1506 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. దీంతో ఇప్పటివరకు వైరస్ జయించిన వారి మొత్తం సంఖ్య 16,287కి చేరింది. ప్రస్తుతం 11,012 మంది రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 1422 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. నిన్న హైదరాబాద్లో 1419 కరోనా వైరస్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తర్వాత రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్ 94, కరీంనగర్ 32, నల్లగొండ 31, నిజామాబాద్ 19 మందికి కరోనా వైరస్ సోకింది.