తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా: 2వేలకు చేరువులో యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 42,432 నమూనాలను పరీక్షించగా.. 189 మందికి కరోనా సోకినట్లు తేలింది. కరోనా బారినపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
తాజాగా, నమోదైన 189 కేసులతో రాష్ట్రంలో ఒప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,98,453కి చేరింది. గత 24 గంటల్లో ఇద్దరు మరణించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో సంభవించిన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1632కు చేరింది.
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 129 మంది పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 2,94,911కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 1910 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 818 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో 31 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 86,18,845 కరోనా నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కాగా, కరోనా బులెటిన్లను వారానికోసారి ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నించగా.. హైకోర్టు మాత్రం రోజువారీగా వివరాలను వెల్లడించాల్సిందేనని స్పష్టం చేసింది.
మరోవైపు దేశంలోనూ కరోనా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. వరుసగా రెండో రోజూ 16వేలకుపైగా కేసులు నమోదు కావడం గమనార్హం. మరణాలు కూడా 100కుపైనే నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 8,31,807 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,577 కొత్త కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజాగా, కరోనా బారినపడి 120 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,56,825కి చేరింది. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. మరోవైపు కోలుకుంటున్నవారి సంఖ్య తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటలల్లో 12,179 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు ఈ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1.07 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,55,986 యాక్టివ్ కేసులున్నాయి.