భయపెడుతున్న లెక్కలు.. తెలంగాణలో కొత్తగా 1892 కరోనా కేసులు.. ప్రభుత్వ విప్కు పాజిటివ్..
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. నిన్న,మొన్నటిదాకా వెయ్యికి పైగా కేసులు నమోదవగా... నేడు ఆ సంఖ్య 2వేలకు దగ్గరగా చేరింది. శుక్రవారం(జూలై 3) రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1658 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 8 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,462కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 283కి చేరింది. ఇప్పటివరకూ 10,195 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవగా... ప్రస్తుతం 9,984 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ప్రభుత్వ విప్కు పాజిటివ్...
తెలంగాణ ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు కరోనా పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం ఆమె యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె భర్త గొంగిడి మహేందర్ కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా... ఆ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని,ఆలేరు నియోజకవర్గ ప్రజలు,కార్యకర్తలు,అభిమానులు ఆందోళన చెందవద్దని సునీత విజ్ఞప్తి చేశారు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దయ,ఆలేరు ప్రజల అభిమానంతో త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రజాప్రతినిధులను వెంటాడుతున్న కరోనా...
తెలంగాణలో ఇప్పటికే ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,బాజిరెడ్డి గోవర్దన్,బిగాల గణేష్ గుప్తా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. హోంమంత్రి మహమూద్ అలీ,డిప్యూటీ స్పీకర్ పద్మారావు కూడా కరోనా బారినపడ్డారు. కాంగ్రెస్ నేతలు వి హనుమంతరావు,గూడూరు నారాయణ రెడ్డి కరోనా బారినపడగా... వీహెచ్ కరోనాను జయించి డిశ్చార్జి అయ్యారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
ఈ వారంలో కేసుల సరళి...
ఈ వారం తెలంగాణలో నమోదైన కేసులను పరిశీలిస్తే ప్రతీరోజూ వెయ్యికి కాస్త అటు ఇటుగా కేసులు నమోదయ్యాయి. సోమవారం(జూన్ 29) 975 కేసులు,మంగళవారం 945,బుధవారం 1018,గురువారం 1213,శుక్రవారం1892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న మొన్నటిదాకా వెయ్యి మార్క్ని చేరిన కేసులు తాజాగా 2వేల మార్క్కి చేరువగా వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది.
Recommended Video
హైదరాబాద్ ప్రజల్లో ఆందోళన...
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో కరోనా వైరస్ కేసులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది జనం హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్లిపోయారు. ప్రభుత్వం లాక్ డౌన్ విధించే అవకాశం ఉందన్న ప్రచారం జరగడంతో చాలామంది గ్రామాల బాటపట్టారు. ఇక్కడే ఉందామనుకునేవాళ్లు నెలకు సరిపడా కిరాణ వస్తువులను కొనుగోలు చేశారు. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటివరకూ లాక్ డౌన్పై ఎలాంటి క్లారిటీ లేదు. దీనిపై కేబినెట్ భేటీ ఉంటుందన్న ఊహాగానాలు వినిపించినప్పటికీ... దానిపై కూడా స్పష్టత లేకుండా పోయింది.