తెలంగాణలో 4వేలు దాటిన కరోనా కేసులు.. మరో 8 మంది మృతి..
తెలంగాణలో కొత్తగా 191 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 8 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,111కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 156కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఇవాళ నమోదైన కేసుల్లోనూ జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 143 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డిలో 11, మేడ్చల్లో 11, రంగారెడ్డిలో 8, మహబూబ్ నగర్లో 4, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో 3 చొప్పున, నాగర్ కర్నూల్, కరీంనగర్లో 2 చొప్పున, నిజామాబాద్, వికారాబాద్, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 448 మంది విదేశాలు,ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు,వలస కార్మికులు ఉన్నారు. ఇప్పటివరకూ 1817 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.ప్రస్తుతం 2138 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలో మృతుల సంఖ్య ప్రతీ రోజూ 5కి పైనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఆదివారం (జూన్ 7) రాష్ట్రంలో అత్యధికంగా 14 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.