తెలంగాణలో ఒక్కరోజులో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు, ఐదు మరణాలు
హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం మొత్తం 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో 196 కరోనా కేసులు రాష్ట్రానికి చెందినవి కాగా, మరో 3 వలస కార్మికులకు సంబంధించినవని తెలిపింది.
జూన్ 30 వరకు తెలంగాణలో లాక్డౌన్: అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేత
82కు చేరిన మరణాలు..
తాజా 199 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,698కి చేరింది. అయితే, లోకల్ కేసులు మాత్రం 2264 అని తెలిపింది. కాగా, ఆదివారం కరోనాతో మరో ఐదుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 82కు చేరింది.
జిల్లాల్లోనూ కొత్త కేసులు..
ఈరోజు నమోదైన కరోనా కేసుల్లో జిల్లాలకు చెందినవి కూడా ఎక్కువగా ఉండటం గమనార్హం. జీహెచ్ఎంసీ పరిధిలో 122 కేసులు ఉండగా, రంగారెడ్డి 40, మహబూబ్ నగర్, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో 3 కేసుల చొప్పున, మేడ్చల్ జిల్లాలో 10, ఖమ్మంలో 9, సూర్యపేట, జనగామ, నిర్మల్లో ఒక్కో కేసు చొప్పున, వరంగల్ అర్బన్లో 2 కేసుల చొప్పున గుర్తించారు.
14 జిల్లాలో ఒక్క కేసూ లేదు
కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 2,264 మంది బాధితులు రాష్ట్రానికి చెందినవారుండగా, 434 మంది వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే 11 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదని వెల్లడించింది.
Recommended Video
దేశంలోనూ పెరుగుతున్న కేసులు
ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,84,735 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 91,682 యాక్టివ్ కేసులున్నాయి. 87,789 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 5253 మంది కరోనాతో మరణించారు. కాగా, మహారాష్ట్రలో అత్యధికంగా 2197 మంది కరోనాతో మరణించారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 65,168 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 34,890 మంది కరోనాతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలినవారు కరోనా నుంచి కోలుకున్నారు.