ఖోఖో ఆడుతూ ఇద్దరు విద్యార్ధులు మృతి: ఒకరు ఖమ్మం, మరొకరు వరంగల్లో
హైదరాబాద్: ఖోఖో ఆడుతూ వేర్వేరు ఘటనల్లో మరో ఇద్దరు మృతి చెందారు. రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నిర్వహించిన ఖోఖో ఆట పోటీల్లో పాల్గొన్న ఇద్దరు విద్యార్ధులు అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు విడిచిన సంఘటన శనివారం చోటు చేసుకుంది.
పోలీసులు కథనం ప్రకారం... ఖమ్మం జిల్లా చంద్రుగొండ మండలం పోకలగూడెం గ్రామానికి చెందిన భూక్యా భద్రాచలం (13) వెంగన్నపాలెంలోని సాధన పబ్లిక్ పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నాడు. రిపబ్లిక్ డే వేడుకను పురస్కరించుకుని టీచర్లు పిల్లలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా శనివారం భద్రాచలం తోటి విద్యార్థులతో కలసి ఖోఖో ఆడుతున్నాడు. ఈ క్రమంలో పరుగెత్తుతూ ఆకస్మాత్తుగా గ్రౌండ్లో కింద పడిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ విద్యార్థిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడ నుంచి కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే భద్రాచలం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇతని తల్లిదండ్రులు భూక్యా హరి, కళ వ్యవసాయ పనులకెళ్తూ కుమారుడిని చదివిస్తున్నారు. మృతదేహంతో తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
మరోవైపు వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం బత్తులపల్లి ప్రాథమికోన్నతపాఠశాలలో విద్యార్థులకు శనివారం ఖోఖో పోటీలు నిర్వహించారు. ఖోఖో ఆడుతున్నఎనిమిదో తరగతివిద్యార్థి విజయ్కుమార్(13) పరిగెడుతూ కళ్లు తిరుగుతున్నాయని చెప్పాడు.
దీంతో వెంటనే అతన్ని స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. వైద్యుడు పరీక్షిస్తుండగానే అపస్మారక స్థితిలోకి వెళ్లిన విజయ్ని వెంటనే కొత్తగూడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. స్థానిక తహసీల్దార్ పాల్సింగ్, ఎంపీడీవో జయరాంనాయక్లు పాఠశాలను సందర్శించి సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.