సిరియాలో ఇద్దరు హైదరాబాదీలు, ఓ ఏపి వ్యక్తి కూడా: ఒకరిని గుర్తించిన ఎన్ఐఏ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది వ్యక్తులు ఐఎస్ ఉగ్రవాదంవైపు ఆకర్షితులవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. కాగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ఐఎస్ సానుభూతిపరుల నుంచి కేంద్ర నిఘావర్గాలు, జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కీలకమైన అంశాలను రాబట్టినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్లో ఎన్ఐఏ పట్టుకున్న నఫీజ్, అబుఅనాజ్లను నిఘావర్గాలు, ఎన్ఐఎ అధికారులు వేర్వేరుగా విచారించగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఐస్ సానుభూతిపరులకు సంబంధించిన వివరాలు చెప్పినట్టు సమాచారం.
ఈ నలుగురి వద్ద స్వాధీనం చేసుకున్న కంప్యూటర్, సెల్ఫోన్లు, ల్యాప్టాప్ ద్వారా ఎవరెవరు క్రియాశీలకంగా ఉన్నారన్న విషయాలను అధికారులు గుర్తించినట్టు తెలిసింది. మెహిదీపట్నం ప్రాంతంలోని ఇద్దరు యువకులు అర్షద్ అయూబ్, ఖదీర్లు ఐఎస్ భావజాలంలో ఆకర్షితులై మూడు నెలల క్రితం సిరియాకు వెళ్లినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి.
కొద్దిరోజుల క్రితం ఖదీర్ తన స్నేహితుడికి ఫోన్ చేసి తాను సిరియాలో ఉన్నానని, త్వరలో యుద్ధంలో పాల్గొనబోతున్నానని చెప్పినట్లు ఎన్ఐఏ అధికారులు తెలుసుకున్నారు. అర్షద్ అయూబ్ ఆచూకీ లభించలేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫేస్బుక్ ఖాతాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, హైదరాబాద్లో ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసిన నలుగురు ఐఎస్ సానుభూతిపరులు చెప్పిన అంశాల ఆధారంగా పరిశోధన కొనసాగించగా ఐఎస్లో సభ్యులు దుబాయ్, సిరియా నుంచి ఇంటర్నెట్ ఫోన్లు, ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా యువకులతో సంభాషిస్తున్నారని తెలిసింది.
యువత ఐఎస్ భావజాలానికి ఆకర్షితుల్ని చేసేందుకు, జిహాద్ సాహిత్యంపై చర్చించేందుకు రహస్య సమావేశాలను నిర్వహించాలంటూ ముంబై, ఢిల్లీ, నాగపూర్, పుణె నగరాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, మంగళూరులకు హవాలా పద్ధతుల్లో నిధులు సమకూర్చుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే షరీఫ్ మొహియుద్దీన్ వారంలో రెండుసార్లు రహస్య సమావేశాలు నిర్వహించినట్టు తెలిసింది.
వీటిద్వారా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పదుల సంఖ్యలో ఐఎస్ సానుభూతిపరులున్నారని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆభియోగాలపై కొందరిని అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం. ముంబైలో ఓ సానుభూతిపరుడిద్వారా హవాలా మార్గాలను గుర్తించినట్టు తెలిసింది.
సిరియాకు గుంటూరు వ్యక్తి
కువైట్కు వలసవెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి కూడా సిరియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఏపికి చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన వన్ రెహమాన్ ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి కువైట్ కు వలస వెళ్లాడు. ఆ తర్వాత అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో చేరాడు. అనంతరం అతడు కనిపించకుండా పోయాడు. ఈ ఘటనపై అమెరికా, ఇండియా అధికారులు విచారణ జరుపుతున్నారు.