తల్లీ కొడుకు మృతి: వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తుండగా విద్యుత్ షాక్
హైదరాబాద్: నగరంలోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో తల్లీ కొడుకు మృతి చెందిన సంఘటన వారాసిగూడ ముంతాజ్ కేఫ్ సమీపంలో జరిగింది. రోజు వారీగా దుస్తులు ఉతికే పనిలో భాగంగా అలీ మున్నీషా అనే మహిళ వాషింగ్ మిషల్ బట్టలు వేస్తుండాగ ప్రమాదం జరిగింది.
వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తుండగా షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో షాక్కు గురైన ఆమె కిందపడిపోయింది. కరెంట్ షాక్తో విలవిలలాడుతున్న తల్లిని ఆమె నాలుగేళ్ల కుమారుడు గమనించాడు. తల్లికి ఏమైందోనని పక్కనే ఉన్న బాలుడు తల్లిని పట్టుకోవడంతో అతడు కూడా విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు.
ఈ ప్రమాదంలో తల్లీ కొడుకు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమదాన్ని రెండు గంటల వరకు ఎవరూ చూడలేదు. ఇంటి ఓనర్ పనిలో భాగంగా కిందకు వచ్చి చూస్తే ఇద్దరు అచేతనంగా పడి ఉండటాన్ని చూసి మృతురాలి భర్తకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఒకే ఇంట్లో ఇద్దరు మృత్యువాత పడటంతో అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి. వాషింగ్ మిషన్ వైర్ పూర్తిగా నీటిలో ఉండటమే ప్రమాదానికి కారణమని ఇరుగు పోరుగు వారు భావిస్తున్నారు. ప్రమాదం సంభవించినప్పుడు మృతురాలు కూడా నీటిలో ఉండటం వల్ల విద్యుత్ షాక్కు గురైంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.