నేతలపై వేటు, కాంగ్రెస్కు ఎన్నో అనుమానాలు: ఈ ప్రశ్నలతో కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి!
హైదరాబాద్: మండలి చైర్మన్ స్వామి గౌడ్ పైన సోమవారం అసెంబ్లీలో జరిగిన దాడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేయడంతో పాటు 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సెషన్ వరకు వేటు వేశారు. శాసన సభ్యత్వాలు రద్దయిన వారిలో కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ కుమార్లు ఉన్నారు.
చదవండి: గవర్నర్కు డిసిప్లేన్ లేదా, ఢిల్లీలో మీరు వెళ్లట్లేదా: జీవన్, 'స్వామిగౌడ్ కార్నియా దెబ్బతింది'
అదే సమయంలో కాంగ్రెస్ సభ్యులతో పాటు నిన్న సంయమనంతో తన సీట్లో కూర్చున్న జానారెడ్డిని కూడా సస్పెండ్ చేయడం విమర్శలకు తావిస్తోంది. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల చరిత్రలో ప్రతిపక్ష నేతను సస్పెండ్ చేయడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్తో పాటు బీజేపీ, ఇతర పార్టీల అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసేలా ప్రశ్నిస్తున్నాయి.
చదవండి: నియంతలా: 48 గంటల దీక్ష ప్రారంభించిన కోమటిరెడ్డి, సంపత్
జానారెడ్డిపై చర్యలు తీసుకోవడమా?
నిజంగానే దాడి జరిగి ఉంటే, దాడికి సంబంధం లేని జానా రెడ్డిపై చర్యలు దురదృష్టకరమని, ఆయన ప్రవర్తనను, హుందాతనాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉండెనని బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డితో పాటు ఇతర పార్టీలు అంటున్నాయి. జానారెడ్డి కూడా మాట్లాడుతూ.. మార్షల్స్ తమ సభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించారని, వెల్లోకి వెళ్లడం ఎక్కడైనా సహజమేనని, తమ పార్టీ సభ్యులను వెళ్లకుండా మార్షల్స్ను చాలామందిని ఉంచి అడ్డుకున్నారని, తాను సంయమనంతో వెనుక బెంచ్కు వెళ్లానని చెప్పారు. అయినా జానాపై చర్యలు తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు.
నాడు తెలంగాణ కోసం, నేడు రైతుల కోసం
తెలంగాణ ఉద్యమం సమయంలో హరీష్ రావు సహా టీఆర్ఎస్ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని, కొట్టబోయేలా వ్యవహరించారని, ఇప్పుడు తాము రైతుల కోసం గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశామని కాంగ్రెస్ చెబుతోంది. నాడు గవర్నర్ను కొట్టబోయారని, బెంచీలపైకి ఎక్కి ఎగిరారని, కానీ ఇప్పుడు గవర్నర్ ప్రసంగంలో రైతుల అంశం లేకపోవడంతో తాము నిరసన తెలిపితే ఇలా చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. నాడు తెలంగాణ ఉద్యమం కోసం చేస్తే, నేడు రైతుల కోసం తాము ప్రసంగాన్ని అడ్డుకున్నామని చెబుతున్నారు. దీనికి టీఆర్ఎస్ వద్ద సరైన సమాధానం లేదంటున్నారు.
కేసీఆర్ చేరమన్నారని స్వామిగౌడ్ స్వయంగా
స్వామిగౌడ్కు నిజంగానే దెబ్బతగిలితే వీడియో విడుదల చేయాలని, తనను కేసీఆర్ సరోజిని ఆసుపత్రిలో చేరాలని స్వామిగౌడ్ స్వయంగా చెప్పారని వీటిని బట్టే ఇది డ్రామా అని అర్థమవుతోందని కాంగ్రెస్ చెబుతోంది. తామందరిని బయటకు పంపించి బడ్జెట్ ఆమోదింప చేసుకోవాలని తెరాస ప్రయత్నిస్తోందన్నారు.
మీరు ఢిల్లీలో చేయవచ్చు, మేం హైదరాబాద్లో చేయొద్దా
పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారని, ఈ రోజు కూడా కేసీఆర్ కూతురు కవిత వెల్లోకి వెళ్లి ఆందోళన చేస్తున్నారని, కానీ ఇక్కడ మేం రైతుల కోసం వెల్లోకి వెళ్లవద్దా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. తమపై చర్యల ద్వారా కేసీఆర్ యావత్ తెలంగాణను అవమానించారని తెలిపారు.
ఆ కన్నుకు ఎలా గాయమైంది
మైకు విసిరితే ఇటు కూర్చున్న వ్యక్తికి అటు కన్ను ఎలా గాయమైందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్కు డ్రామాలు అలవాటేనని, పోడియం వద్దకు వెళ్లి నిరసన చేస్తామంటే తొలుత పోలీసులే అడ్డుకున్నారని, నిరసన హక్కు అని చెబుతున్నారు. హెడ్ ఫోన్స్ ఎవరికి తగిలాయో వీడియో విడుదల చేసి చూపించాలని అంటున్నారు.
నాలుగేళ్లుగా వాటిపై, ఒక్క రోజులో దీనిపై
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం స్పీకర్ పరిధిలో ఏళ్లుగా ఉందని, దాని గురించి పట్టించుకోకుండా, ఒక్క రోజులో కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకున్నారని, ఇది స్పీకర్ పదవికే మచ్చ తెచ్చే అంశమని కాంగ్రెస్ నేతలు అన్నారు. తెలంగాణలో 4000 మంది రైతులు ఆత్మహహత్య చేసుకుంటే కేసీఆర్ నిద్రపోయారా అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదు, దళితులకు మూడెకరాల భూమి లేదు, డబుల్ బెడ్రూం లేదు.. ఇన్ని వైఫల్యాలు అని మండిపడ్డారు. కేసీఆర్ ఉంటే ప్రజాస్వామ్యానికి కీడు అని ప్రజల్లోకి వెళ్తామన్నారు. హెడ్ ఫోన్స్ ఎవరికి తగిలాయో ఎందుకు చూపడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంలో రైతుల ఆత్మహత్యలు, గిట్టుబాటు ధరల ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు.