ఎంసెట్ షాకింగ్: కింగ్ పిన్ ఖలీల్, సీఐడీ తెలివికి విద్యార్థులు ఖంగు
హైదరాబాద్: ఎంసెట్ 2 లీక్ నేపథ్యంలో ఎంసెట్ 3 నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ దిశలో కసరత్తు ప్రారంభించింది. పరీక్ష నిర్వహించాల్సి వస్తే ముందుగానే సిద్ధం కావాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది.
ఎంసెట్ లీక్లో 'బీహారీ'?: కేసీఆర్ ఏం చేస్తారో, పేరెంట్స్ ధర్నా, విద్యార్థుల కంటతడి
ఈ నేపథ్యంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూ అధికారులు తాత్కాలిక షెడ్యూల్ను రూపొందించినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. ఎంసెట్ 2ను రద్దు చేస్తే మళ్లీ ప్రకటన జారీ చేసే అవసరం లేదని, ఎంసెట్ 1 కూడా రద్దు చేస్తేనే ప్రకటన చేయాల్సి ఉందని అంటున్నారు. ఎంసెట్ 3కి కన్వీనర్గా జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్ రెడ్డి పేరును పరిశీ లిస్తున్నారని తెలుస్తోంది.
రాజగోపాల్ కాదు.. ఖలీల్ కింగ్ పింగ్!
ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇందులో రాజగోపాల్ రెడ్డి కీలక సూత్రధారి అనే వాదనలు ఇప్పటి దాకా వచ్చాయి. అయితే, అతను కాదని, ఖలీల్ అనే వ్యక్తి కింగ్ పింగ్ అని అంటున్నారు.
ఖలీల్ ఆధ్వర్యంలోనే ఢిల్లీ కేంద్రంగా ప్రశ్నపత్రం బహిర్గతమైనట్లు, రెండు అంచెల్లో మధ్యవర్తుల్ని ఏర్పరచుకొని రూ.కోట్లు రాబట్టుకున్నట్లు సీఐడీ గుర్తించిందని తెలుస్తోంది. ఈ స్కాం విలువ రూ.80 కోట్ల వరకూ ఉండొచ్చంటున్నారు. లబ్దిపొందిన విద్యార్థుల సంఖ్య కూడా అందరూ అనుకున్నట్లు 72 కాదని, 100 నుంచి 130 మంది దాకా ఉండొచ్చని భావిస్తున్నారు.
ఖలీల్ ప్లాన్గా ఒకరితో సంబంధం లేకుండా మరొకరిని దళారిగా ఏర్పాటు చేసుకున్నందునే ఎంత మంది మీడియేటర్లు అని కచ్చితంగా తెలియడం లేదని సమాచారం. ఇప్పటిదాకా ఆరుగుర్ని గుర్తించారు. పరీక్షలకు ముందు విద్యార్థులను దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతాలకు తీసుకెళ్ళి సిద్ధం చేయించారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
ఖలీల్ పేరు బయటపెట్టిన రాజగోపాల్
సీఐడీ విచారణ చేపట్టగా మొదట రాజగోపాల్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. 2007 నుంచి ఇతను ఇలా చేస్తుండటంతో ఇతనే సూత్రధారి అని భావించారు. కానీ విచారణలో మరిన్ని విషయాలు తెలిశాయి. రాజగోపాల్ రెడ్డి విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడించాడని తెలుస్తోంది.
ఏబీవీపీ ఆందోళన
ఎంసెట్ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో ఏబీవీపీ హైదారబాదులో నిరసన తెలిపింది. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు అన్యాయం చేయవద్దని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.
నేడు నివేదిక
ఎంసెట్ కుంభకోణంపై డీజీపీ అనురాగ్ శర్మ శుక్రవారం నివేదిక ఇవ్వనున్నారు. ప్రశ్నపత్రం ముందుగానే వెల్లడయినట్లు స్పష్టం చేయనున్నారు.
విచారణ
ఎంసెట్ ప్రశ్నపత్రం లీకు వ్యవహారంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులపై అనుమానంతో సీఐడీ రంగంలోకి దిగింది. గుడిహత్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్నగర్ ప్రాంతాల్లో గురువారం నాడు సీఐడీ అధికారులు దర్యాప్తు జరిపారు. కాగజ్నగర్లో సీఐడీ అధికారులు విచారణకు వస్తున్న సమాచారం తెలుసుకున్న సంబంధిత విద్యార్థి కుటుంబ సభ్యులతో సహా ఇంటికి తాళం వేసుకుని పరారయ్యారు.
విచారణ
విద్యార్థుల చిరునామాల ఆధారంగా సీఐడీ అధికారులు ఇళ్లకు వెళ్లి విచారణ నిర్వహించారు. కరీంనగర్కు జిల్లాకు చెందిన ఆరుగురు విద్యార్థులకు ఇందులో పాత్ర ఉన్నట్లు సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు.
సీఐడీ ప్రకటన
పరీక్షకు ముందే ఎంసెట్ 2 ప్రశ్నపత్రాలు రెండు సెట్లూ బహిర్గతమయ్యాయని సీఐడీ అదనపు డీజీ సత్యనారాయణ్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 9వ తేదీన ఎంసెట్ పరీక్షకు ముందే ప్రశ్నపత్రం వెల్లడయిందని, ఈ విషయాన్ని 19వ తేదీన పత్రికల్లో కథనాలు వచ్చాయని వివరించారు.
సీఐడీ ప్రకటన
డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశాల మేరకు తొలుత ఈ ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరిపి ఆ తర్వాత కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టామని, తమ దర్యాప్తులో ప్రశ్నపత్రం ముందే బహిర్గతమైనట్లు తేలిందన్నారు. రెండు సెట్లకు చెందిన 320 ప్రశ్నలూ ముందుగానే వెల్లడయ్యాయని, పరీక్షకు రెండు, మూడు రోజుల ముందు విద్యార్థులను వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్ళి శిక్షణ ఇప్పించారన్నారు.
సీఐడీ ప్రకటన
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరులకు చెందిన దళారులు, ఉప దళారులను గుర్తించామని, వీరిలో హైదరాబాద్కు చెందిన విష్ణుధర్ అలియాస్ విష్ణువర్దన్, తిరుమల్ ను అరెస్టుచేసినట్లు సత్యనారాయణ్ తెలిపారు.
ఖలీల్ తనను సంప్రదించాడని, ఎంసెట్ 2 ప్రశ్నపత్రం తనవద్ద ఉందని, విద్యార్థులను చూడమంటూ చెప్పాడని రాజగోపాల్ రెడ్డి వెల్లడించాడు. మిగతా వారిని విచారించగా ఖలీల్ పేరు చెప్పారు. దీంతో అసలు సూత్రధారి ఖలీల్ అని నిర్ధారణకు వచ్చారు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో ఖలీల్ దానిని ప్లాన్గా సొమ్ము చేసుకుంటున్నారని చెబుతున్నారు. ప్రయివేటు వైద్య కళాశాలల్లో సీట్ల కోసం హైదరాబాద్కు చెందిన తిరుమలరావు, విష్ణులు తన వద్దకు వస్తుంటారని, బహిర్గతమైన ప్రశ్నపత్రాన్ని అమ్ముకునేందుకు విద్యార్థులను వెతికే పనిని వారికి పురమాయించానని రాజగోపాల్ రెడ్డి సీఐడీకి చెప్పాడని తెలుస్తోంది.
ఒక్కో విద్యార్థి నుంచి రూ.50 లక్షల నుంచి 70 లక్షల చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. విద్యార్థులకు రహస్య ప్రాంతంలో శిక్షణ ఇచ్చినట్లు చెప్పాడు. మొత్తం రెండు సెట్ల ప్రశ్నపత్రాలు తన వద్ద ఉన్నాయని తెలిపాడు. తాను బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు రాజగోపాల్ రెడ్డి చెప్పాడు. కాగా, చాలామంది దళారులు ఉన్నారని, ఒకరికి తెలియకుండా మరొకరు ఉన్నారని గుర్తించారు.
ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో తొలుత 70 మంది ఉన్నారని భావించినా, వందకు పైగా ఉన్నారని బావిస్తున్నారు. విద్యార్థులను తొలుత ముంబై, బెంగళూరు తీసుకెళ్ళి శిక్షణ ఇప్పించినట్లు భావించారు. కానీ వారిని ఈ రెండు నగరాలతోపాటు, పుణె, భువనేశ్వర్, చెన్నైలకు తీసుకెళ్ళి రెండు రోజుల పాటు తీసుకెళ్లారు. తక్కువ సమయంలో చేరుకోగలిగి, ఎక్కువ సంఖ్యలో విమాన రాకపోకలు ఉన్న ప్రాంతాలనే ఎంచుకున్నారు.
సీఐడీ అధికారులు విద్యార్థులను కూడా విచారిస్తున్నారు. దాదాపు ఇరవై మంది విద్యార్థులను విచారించగా, తాము కష్టపడి చదువుకున్నామని చెప్పారని తెలుస్తోంది. అయితే, వారు ప్రయాణించిన టిక్కెట్లు బయటపెట్టడంతో విద్యార్థులు ఖంగు తిన్నారని తెలుస్తోంది. వారు ఒక్కరొక్కరు పెదవి విప్పుతున్నారు. ఈ విషయమై తల్లిదండ్రుల పైన కేసులు పెట్టనున్నారు.