3 కి.మీ పరిధిలో గల 61 స్కూళ్లకు 2 వేల హోమియో మందులు, మరో 20 వేల డోసులు: డీఈవో
ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. దుబాయ్ వెళ్లొచ్చిన సాప్ట్వేర్ ఇంజినీర్కు కూడా వైరస్ సోకడంతో భాగ్యనగరం ఉలిక్కిపడింది. దీంతో అతను ఇంటి సమీపంలో ఉన్నవారికి కూడా వైరస్ సోకిందా ఆందోళన నెలకొంది. పెద్దలు అయితే ఓకే.. కానీ పిల్లలకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నందున... వారి కోసం హోమియో మందులు అందజేస్తున్నారు. సాప్ట్వేర్ ఇంజినీర్ ఇంటి పరిసరాల నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో గల పాఠశాల విద్యార్థులకు అందజేస్తున్నామని హైదరాబాద్ జిల్లా విద్యాధికారి ధృవీకరించారు.
61 పాఠశాలల విద్యార్థులకు తొలుత హోమియో ప్రివెంటివ్ మెడిసిన్ అందజేస్తున్నామని హైదరాబాద్ డీఈవో తెలిపారు. మరో 20 వేల హోమియో డోసులు కూడా వస్తున్నాయని.. వాటిని మిగతా పాఠశాలలకు పంపిస్తామని పేర్కొన్నారు. దీంతోపాటు కరోనా వైరస్ అంటే..? ఎలా వస్తోంది..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. మందుల విషయంలో, వైరస్ విషయంలో సందేహాలుంటే వైద్యశాఖతో సమన్వయం చేసుకొని ముందుకుసాగుతున్నామని పేర్కొన్నారు.
కరోనా వైరస్ అంటే పిల్లల్లో అపోహను తొలగించి, భయం పొగొట్టేందుకు కృషి చేస్తున్నామని ఆమె వివరించారు. పదే పదే హ్యాండ్ వాష్ చేసుకోవాలని.. దీంతో వైరస్ ప్రబలకుండా ఉంటుందని పేర్కొన్నారు. వైరస్ లక్షణాలు ఉన్న విద్యార్థులు, టీచర్లు.. స్కూల్కి రాకపోయిన ఫరవాలేదని.. ఇందుకు సంబంధించి ఆదేశాలు కూడా జారీచేశామని పేర్కొన్నారు. వైరస్ సోకిన సాప్ట్వేర్ ఇంజినీర్ క్రమంగా కోలుకుంటున్నారని వైద్యారోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ మీడియాకు తెలిపారు.