ఘోర ప్రమాదం... వేగంగా దూసుకెళ్లి స్తంభాన్ని ఢీకొన్న బైక్... ఇద్దరు మృతి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బైక్ వేగంగా దూసుకొచ్చి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళ్తే... బుధవారం రాత్రి(అగస్టు 26) ఇద్దరు యువకులు మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గా నగర్ చౌరస్తాలో ఓ బైక్పై వేగంగా దూసుకొచ్చారు. ఆరంఘర్ నుంచి చాంద్రయాన్ గుట్ట వైపు వెళ్తుండగా మితిమీరిన వేగంతో బైక్ను నడిపి... అదుపు చేయలేక విద్యుత్ స్తంభానికి ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. రెప్ప పాటులో జరిగిన ఈ ప్రమాదంలో అక్కడున్నవారిని హడలిపోయేలా చేసింది.
ప్రమాదంపై సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి మృతులను బండ్లగూడకు చెందిన మహ్మద్ సాజిత్ తన స్నేహితుడు కాజా మోయినుద్దీన్గా గుర్తించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాలను తరలించారు.
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అతి వేగమే ప్రాణం తీసిందని నిర్దారించారు. హెల్మెట్ ధరించకుండా బైక్ డ్రైవ్ చేసినట్లు చెప్పారు. బైక్లపై విన్యాసాలు చేయడం,అతివేగంతో దూసుకెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చేయవద్దని పోలీసులు ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నారు. ముఖ్యంగా యువత బైక్లతో రోడ్ల పైకి వచ్చి హల్చల్ చేయడం కామన్గా మారిపోయింది. కొన్నిసార్లు ఇతరుల ప్రాణాలు పోవడానికి కూడా వారు కారణమవుతున్నారు. కనీసం ఇలాంటి ఘటనలు చూసినప్పుడైనా వారిలో మార్పు వస్తుందని ఆశిద్దాం.