సీసీఎస్ కస్టడీకి నౌహీరా ...దేశవ్యాప్తంగా బాధితులు .. సీబీఐ దర్యాప్తుకు వినతి
హైదరాబాద్ : వేలాది మంది నుంచి డిపాజిట్లు సేకరించి మోసం చేసిన హీరా గోల్డ్ కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. రూ. కోట్లు వసూల్ చేసిన నౌహీరా షేక్ ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ స్కాంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది ? సేకరించిన నగదు ఏం చేశారనే అంశాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు.
కస్టడీకి నౌహీరా షేక్
ఎక్కువ వడ్డీ ఇస్తానని ఆశచూపి ముంచిన నౌహీరాను సీసీఎస్ పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. కస్టడీలో హీరా గోల్డ్ సంస్థ ఆవిర్భావం .. డిపాజిట్ల సేకరణ .. ఉద్యోగులు, మొత్తం డిపాజిట్ దారుల సంఖ్య తదితర అంశాలపై కూలంకుషంగా విచారిస్తారు. అలాగే గతంలో జరిపిన సోదాల్లో లభించిన డాక్యుమెంట్ల ఆధారంగా వేల కోట్ల నిధులను ఎక్కడికి తరలించారనే అంశంపై కూపీ లాగనున్నారు.
నిధులు ఎక్కడివీ ?
హీరా గోల్డ్ కంపెనీకి డిపాజిట్లు సేకరించింది మొత్తం 8 వేల మంది డిపాజిట్ దారులు. వీరు నగదు మొత్తం దాదాపు 6 వేల కోట్ల అవుతుందని ప్రాథమికంగా లెక్కగట్టారు. హీరా గోల్డ్ ప్రధాన కార్యాలయంలో జరిపిన సోదాల్లో 100 కోట్ల విలువైన ఖాళీ విత్ డ్రా ఫామ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నిధుల ప్రవాహానికి కారణమేంటీ ? ఎక్కడి నుంచి నిధులు వచ్చాయి ? డిపాజిట్ దారులే గాక ఎవరెవరి పేరుతో నిధులు వచ్చాయనే అంశంపై కూడా విచారిస్తున్నారు.
ఈడీకి లేఖ
హీరా గోల్డ్ కు విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని సీసీఎస్ పోలీసులు చెప్తున్నారు. అమెరికా, దుబాయ్ ఇతర దేశాల నుంచి నగదు వచ్చిందని గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ జరుపాలని ఈడీకి లేఖ రాశారు. మనీ ల్యాండరింగ్ కూడా జరిగి ఉంటుందని .. అందుకే ఎంక్వైరీ చేయాలని కోరుతూ సీసీఎస్ పోలీసులు ఈడీకి లేఖ రాశారు.
సీబీఐ దర్యాప్తుకు వినతి
హీరా గోల్డ్ డిపాజిట్ల సేకరణ .. ఆంధ్రప్రేశ్, తెలంగాణ, మహారాష్ట్ర గాక దేశవ్యాప్తంగా ఉంది. ఈ నేపథ్యంలో కేసును సీబీఐకి అప్పగించాలని సీసీఎస్ కోరుతోంది. డిపాజిట్ల సేకరణకు సంబంధించి సీబీఐ రంగంలోకి దిగితే ఇతర ప్రాంతాల్లో బాధితులు .. సూత్రాధారులు వివరాలు బయటకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.