అలా ఉండలేక..: హెచ్సీయు విద్యార్థి ప్రవీణ్ ఆత్మహత్య, పిరికివాడేం కాదు
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ విభాగం విద్యార్థి ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, మృతి పైన విచారణ జరిపించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
స్వగ్రామానికి ప్రవీణ్ మృతదేహం
శనివారం ప్రవీణ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆయన సొంతూరు షాద్ నగర్ తరలించారు. హెచ్సీయూలో రెండు నెలలక్రితం మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఎంఎఫ్ఏ)లో ప్రవేశం పొందిన ప్రవీణ్.. సరోజినీనాయుడు స్కూల్ ఆఫ్ ఫైనార్ట్స్లో చదువుకుంటున్నాడు.
మిత్రుడితో కలిసి హాస్టల్లో
తనతోపాటు డిగ్రీ చదువుకున్న తమిళనాడు విద్యార్థి మరిరాజతో కలిసి ఎల్ హాస్టల్ రూమ్ 204లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి పది గంటకు మరిరాజా ఆర్ట్ స్టూడియోకి వెళ్లాడు. అర్ధరాత్రి దాటాక వస్తానని, తలుపు తీసే ఉంచమని చెప్పాడు.
హాస్టల్లో సూసైడ్
మరిరాజ శనివారం తెల్లవారుజామున నాలుగుంపావుకు హాస్టల్ గదికి వచ్చి తలుపు తట్టాడు. ప్రవీణ్ తలుపు తీయలేదు. అనుమానం వచ్చి పక్క గదిలో ఉంటున్న స్నేహితులకు విషయం చెప్పాడు. తలుపులు బద్దలగొట్టి వెళ్లి చూడగా ప్రవీణ్ ఫ్యాన్కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు.
దుస్తులు ఆరేసే తాడుతో ఉరి
ప్రవీణ్ను కిందికి దింపి ద్విచక్రవాహనంపై క్యాంపస్లోని హెల్త్ సెంటర్కు తరలించారు. చికిత్స అవసరమంటూ వైద్యులు అతన్ని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రవీణ్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దుస్తులు ఆరేసేందుకు ఉపయోగించే తాడుతో ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతని గదిలో మూడు సెల్ఫోన్లు, ఒక ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు.
అలా ఉండలేను
కాగా, ప్రవీణ్ గదిలో పోలీసులకు ఒక నోట్ పుస్తకం లభించింది. అందులో రెండు పేజీల్లో ఆంగ్ల అక్షరాల్లో తెలుగుభాషలో ఇలా రాసుకున్నాడు. తనకు చాలా లేజీ అని, దీని వల్ల తన పైన తనకే కోపం వస్తోందని, నన్ను ఇలా పుట్టించావేమిటని, నాకు చాలా భయమని, నాలా చదువు రాని వాళ్లు ఉన్నారని, వాళ్లలా నేను బతకలేనని, తనకు చదువు రాకపోవడంతో ఒత్తిడికి గురవుతున్నానని, అందరితో పాటు సంతోషంగా ఉండలేనని ఇలా అతను ఆ పుస్తకంలో రాసుకున్నట్లు తెలుస్తోంది.
ఫోరెన్సిక్కు లేఖ
కాగా, ఈ రాత ప్రవీణ్దేనని నిర్ధరించుకునేందుకు ఫొరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు. చదువులో కొంత వెనుకబాటు, ఒంటరితనంతో మానసికంగా కుంగిపోవడంతో ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నట్టు పాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు చెబుతున్నారు. అతనికి వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలున్నాయా అనే విషయమై విచారించాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసుకున్నారు.
వి హనుమంత రావు పరామర్శ
తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తండ్రి నర్సింహులు చెప్పారు. తమకు ఆర్థిక ఇబ్బందులు కూడా లేవన్నారు. ప్రవీణ్తో నాలుగు రోజుల క్రితమే మాట్లాడానని, బాగున్నట్లు చెప్పారని అన్నారు. అలాగే, తన సోదరుడికి ఎలాంటి సమస్యలు లేవని ప్రవీణ్ సోదరుడు చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ వి హనుమంత రావు కుటుంబాన్ని పరామర్శించారు.