గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల కేసు: తీర్పు సెప్టెంబర్ 4కు వాయిదా
హైదరాబాద్: పదకొండేళ్ల క్రితం హైదరాబాదులోని జంట పేలుళ్ల కేసులో తీర్పును ఎన్ఐఏ న్యాయస్థానం వాయిదా వేసింది. వచ్చే నెల 4వ తేదీన తీర్పును వెలువరించనుంది. లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్ల కేసులో నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టులో సోమవారం తీర్పు రావాల్సి ఉంది. అయితే దీనిని వారం రోజుల పాటు వాయిదా వేసింది.
చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న నిందితులను కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. అనంతరం సెప్టెంబర్ 4వ తేదీకి తీర్పును వాయిదా వేసింది.
కేసులో రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, అనిక్ షఫీక్, ఇస్మాయిల్, మహ్మద్ తారీక్, మహ్మద్ షేక్, షఫ్రుద్దీన్, అమీర్ రిజాఖాన్లను న్యాయస్థానం నిందితులుగా తేల్చింది. ఇందులో ముగ్గురు పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురిపై విచారణ కొనసాగింది. 2007 ఆగస్ట్ 25న ఈ జంట పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో నలభై మందికి పైగా మృతి చెందారు. దాదాపు అరవై మంది గాయపడ్డారు.
2007 ఆగస్ట్ 25న ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ సభ్యులు ఈ రెండు ప్రాంతాలలో బాంబులు అమర్చి విధ్వంసం సృష్టించారు. ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సాక్ష్యాధారాల సేకరణ, బాధితుల వాంగ్మూలం, అభియోగ పత్రాల నమోదు బాధ్యతను ఆక్టోపస్ విభాగానికి అప్పగించారు.
ఈ దుశ్చర్యకు పాల్పడ్డ నిందితులు చర్లపల్లి జైల్లో ఉన్నారు. సుమారు తొమ్మిదేళ్ల పాటు సాగిన విచారణ కొద్దిరోజుల క్రితం తుది దశకు చేరుకుంది. ఈ కేసుకు సంబందించి ఎన్ఐఏ కోర్టు సోమవారం తుది విచారణ జరిపింది. అనంతరం తీర్పును వాయిదా వేసింది.