తెరపైకి సెంథిల్ ఆత్మహత్య: హెచ్సియు ఇంచార్జీ విసికి చిక్కులు (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో (హెచ్సియు) విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యతో వీసీ పొదిలె అప్పారావు సెలవుపై వెళ్తే తాత్కాలిక వీసీగా బాధ్యతలు తీసుకున్న శ్రీవాస్తవకు 2008లో జరిగిన ఓ విద్యార్థి ఆత్మహత్య చిక్కులు తెచ్చిపెట్టింది. అయితే దానికి తాను బాధ్యుడ్ని కానని ఆయన వివరణ ఇచ్చుకున్నారు.
రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో కొద్దికాలంగా తరగతుల నిర్వహణకు అంతరాయం కలిగిందని, రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నది విద్యార్ధుల డిమాండ్గా ఉందని శ్రీవాస్తవ చెప్పారు. అయితే అత్యవసర క్లాసులు, ల్యాబ్ల నిర్వహణకు హెచ్సియు స్టూడెంట్ జాక్ గురువారం నాడు అంగీకరించిందని ఇన్చార్జి విసి చెప్పారు.
కొంతమంది విద్యార్ధులు చదువుకుంటామని, మరికొంత మంది విద్యార్ధులు న్యాయం జరిగే వరకూ చదువులు వద్దు అని నినాదాలు చేయడంతో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గురువారం నాడూ ఉద్రిక్తత కొనసాగింది.
కొనసాగిన ఆందోళన
దాదాపు పరిశోధన విద్యార్ధులు అంతా రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలని కోరుతూ 12వ రోజూ ఉద్యమాన్ని కొనసాగించారు.
చర్యలు తీసుకునేంత వరకూ...
బాధ్యులపై చర్యలు తీసుకునేంత వరకూ ఎలాంటి కార్యకలాపాలు జరగడానికి వీలులేదని వారు పేర్కొన్నారు.
పరిశోధనలకు ఆటంకం
తమ పరిశోధనలకు ఆంటకం కలుగుతోందని, ల్యాబ్లలో రసాయన సామగ్రీ పాడవుతోందని, తాము క్లాసులకు హాజరయ్యేందుకు సిద్ధమని కొంతమంది విద్యార్ధులు చెప్పారు.
బాహాబాహీ..
ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో సైన్స్ ల్యాబ్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఉద్యోగులు సైతం విసిని కలిసి రక్షణ కల్పిస్తే విధుల్లోకి వస్తామని సంసిద్ధత వ్యక్తం చేశారు.
నేను బాధ్యుడ్ని కాను.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్ధి సెంథిల్ కుమార్ ఆత్మహత్యకు తానెంత మాత్రం బాధ్యుణ్ని కాదని వర్శిటీ తాత్కాలిక విసి ప్రొఫెసర్ విపిన్ శ్రీవాస్తవ చెప్పారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
విచారణ జరిగింది
విద్యార్థి సెంథిల్ కుమార్ 2008లో ఆత్మహత్య చేసుకోవడానికి తాను బాధ్యుడిని కాదని స్పష్టం చేశారు. ఈ ఉదంతంపై సిఐడి విచారణ కూడా జరిగిందని గుర్తుచేశారు.
విచారణ జరిపిస్తాం...
విద్యార్ధుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో విచారణ జరిపిస్తామన్నారు. విద్యార్ధులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని న్యాయస్థానాన్ని కోరామని చెప్పారు. భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని విద్యార్ధులు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు.
క్లాసులు జరుగుతాయి
ఆందోళనల కారణంగా స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు, క్లాస్ 4 ఉద్యోగులకు జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. శుక్రవారం నుండి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తరగతులు యథాతథంగా జరుగుతాయన్నారు