ఫ్లాష్ బ్యాక్ 2017: సైకిల్కు పంక్చర్ల మీద పంక్చర్లు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకూ క్షీణిస్తోంది. 2017 ప్రారంభంలో రేవంత్ రెడ్డి కారణంగా కాస్తా హుషారుగా కనిపించినా ఆ తర్వాత తుస్సుమంటూ వచ్చింది.
తెలుగుదేశం తెలంగాణ నాయకులు తలోదారి చూసుకుంటూ ఇతర పార్టీల్లో చేరుతున్నారు. తెలంగాణలో బలమైన నాయకత్వం ఉంటూ వచ్చింది. కానీ రాష్ట్ర విభజన తర్వాత అది నామరూపాలు లేకుండా పరిస్థితి వచ్చింది.
రేవంత్ రెడ్డి కారణంగా కాస్తా జోష్.
రేవంత్రెడ్డి కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కాస్తా జోష్ కనిపించింది, ఆయన కాంగ్రెస్లోకి వెళ్లడంతో ఉత్సాహం లేకుండా పోయింది. ప్రస్తుతం మోత్కుపల్లి నర్సింహులు, ఎల్ రమణ వంటి కొద్ది మంది నాయకులు మాత్రమే మిగిలారు. తెలంగాణలో పార్టీ బలపడుతుందనే నమ్మకం లేకుండా పోయింది
ఏకైక ఎమ్మెల్యే సండ్ర..
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది శాసనసభ్యులు గెలిచారు. చివరకు ఒకే ఒక ఎమ్మెల్యే పార్టీలో మిగిలారు. ఆయన సండ్ర వెంకట వీరయ్య. తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా మిగతా శాసనసభ్యుల్లో ఎక్కువ మంది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరగా, రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెసులో చేరారు.
ఉమా మాధవ రెడ్డి ఫిరాయింపు పెద్ద దెబ్బనే...
రేవంత్ రెడ్డి అక్టోబర్ 31వ తేదీన కాంగ్రెసు పార్టీలో చేరడం టిడిపిని పెద్దగానే దెబ్బ తీసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ను దీటుగా ఎదుర్కోగల నేతగా ఆయన ఆదరణ పొందారు. ఆ తర్వాత ఆ స్థాయిలో కెసిఆర్పై యుద్ధం ప్రకటించే నాయకుడు లేకుండా పోయారు. ఆ తర్వాత ఉమా మాధవరెడ్డి టిడిపికి వీడ్కోలు చెప్పి తెరాసలో చేరడం కూడా టిడిపికి ఝలక్ ఇచ్చిందనే చెప్పాలి.
చంద్రబాబు సమావేశాలే...
రేవంత్ రెడ్డి టిడిపిని వీడుతున్న నేపథ్యంలోనూ, ఆ తర్వాత కొద్ది రోజులు తెలుగుదేశం పార్టీ అధినేత తెలంగాణ నేతల సమావేశాలు ఏర్పాటు చేశారు. నెలకోసారి సమావేశాలు నిర్వహిస్తానని, వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో బిజీగా ఉండడం కారణంగా అది సాధ్యమయేట్లు కనిపించడం లేదు.
మోత్కుపల్లి ఒంటరిపోరు
గవర్నర్ పదవి దక్కుతుందన్న ఆశలు సన్నగిల్లడంతో మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ టిడిపిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. కెసిఆర్పై ఆయన ఒంటరి పోరు సాగిస్తున్నారు. కెసిఆర్ ప్రభుత్వంపై ఆయన విమర్శల జడివాన కురిపిస్తున్నారు. అయినా టిడిపికి తెలంగాణలో జవజీవాలు వస్తాయనే నమ్మకం మాత్రం లేకుండా పోయింది.