2017 ఇయర్ రౌండప్: ప్రజలతో ముఖాముఖి, విపక్షాలకు షాక్, పార్టీ బలోపేతం: కెసిఆర్ ప్లాన్
హైదరాబాద్: 2017 టిఆర్ఎస్కు కలిసొచ్చింది. విపక్షాల నుండి అధికార పార్టీలోకి వలసలు సాగుతూనే ఉన్నాయి. విపక్షపార్టీలకు చెందిన కొందరు కీలక నేతలు అధికారపార్టీలో ఈ ఏడాది కూడ చేరారు. 2019 ఎన్నికలకు టిఆర్ఎస్ నాయకత్వం ఇప్పటి నుండే ప్లాన్ చేస్తోంది. టిఆర్ఎస్ నేతలు నామినేటేడ్ పదవుల కోసం కెసిఆర్ను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
2017 ఇయర్ రౌండప్: రేవంత్ ఎఫెక్ట్ బిజెపికి దెబ్బ, అమిత్షాపైనే ఆశలు
2014 సాధారణ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అనుసరించిన వైఖరి కారణంగా విపక్షాలు బలహీనంగా మారాయి. బంగారు తెలంగాణ సాధన కోసం రాజకీయ పార్టీల పునరేకీకరణ అవసరమని టిఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు టిఆర్ఎస్లో చేరారు.
రేవంత్ దెబ్బ: టిడిపికి అచ్చిరాని 2017, వ్యూహత్మక తప్పిదాలు
విపక్షపార్టీలకు చెందిన కీలకమైన నేతలు టిఆర్ఎస్లో చేరుతూనే ఉన్నారు. పార్టీ అవసరాల ఆధారంగా ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి టిఆర్ఎస్ ఆహ్వనిస్తోంది. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కెసిఆర్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు.
టిఆర్ఎస్కు కలిసొచ్చిన 2017
టిఆర్ఎస్కు ఈ ఏడాది కలిసొచ్చింది.తెలంగాణలో విపక్షాలకు చెందిన కీలక నేతలు అధికారపార్టీలో చేరారు. అయితే టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టిడిపి తెలంగాణలో ఉనికిని కోల్పోయే ప్రమాదం నెలకొందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్, టిఆర్ఎస్ నాయకులు టిడిపి కీలకనేతలను తమ పార్టీలో చేర్చుకొనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు టిఆర్ఎస్లో చేరారు.సంస్థాగతంగా బలపడేందుకు టిఆర్ఎస్ కార్యాచరణను కూడ సిద్దం చేసుకొంది.
ఇతర పార్టీల నేతలపై టిఆర్ఎస్ వల
ఈ ఏడాది పొడవునా టిఆర్ఎస్లో ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు చేరారు. పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడ ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలను కూడ టిఆర్ఎస్లో చేరేలా ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. భూపాలపల్లి, మంథని, నల్లగొండ, భువనగిరి తదితర నియోజకవర్గాలకు చెందిన ఆయా పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరారు.ఇంకా పార్టీలో చేరేందుకు ఆసక్తిని చూపే నేతలకు టిఆర్ఎస్ నాయకత్వం రెడ్ కార్పెట్ వేయనుంది.
రాష్ట్ర కమిటీ నియామకం
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో టిఆర్ఎస్ 16వ, ప్లీనరీ సందర్భంగా ఖాళీగా ఉన్న రాష్ట్ర కమిటీని ప్రకటించారు.అనుబంధ సంఘాల కమిటీలనూ ఏర్పాటు చేయడం ద్వారా సంస్థాగత కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ప్లీనరీ కంటే ముందు చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఏకంగా 72 లక్షల సభ్యత్వం నమోదైనట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. ప్లీనరీ అనంతరం వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహించి పట్టును మరోసారి నిరూపించుకుంది.
పదవుల పందేరం
టీఆర్ఎస్ నాయకులకు ఈ ఏడాది పదవుల పరంగా ఆశవాహులకు మంచి జరిగింది. పార్టీ సీనియర్లకు, తొలి నుంచి పార్టీలో కొనసాగినవారికి నామినేటెడ్ పదవులు ఈ ఏడాది దక్కాయి.ఇక మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. టీచర్ ఎమ్మెల్సీ కోటాలో జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యేల కోటాలో గంగాధర్గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హన్మంతరావులను ఎమ్మెల్సీలుగా గెలిచారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ విజయం సాధించింది. ఇక అసెంబ్లీ వేదికగా కూడా టీఆర్ఎస్ ప్రతిపక్షాలపై పైచేయి సాధించింది. రైతు సమన్వయ సమితుల ఏర్పాటులో గ్రామస్థాయిలో టీఆర్ఎస్ కార్యకర్తలకు పెద్దపీట వేశారు.
బిజెపిపై తీవ్ర విమర్శలు
ఈ ఏడాదిలో తెలంగాణలో పర్యటించిన సమయంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా చేసిన విమర్శలపై తెలంగాణ సీఎం కెసిఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్రానికి ఎక్కువ మొత్తంలో పన్నుల రూపంలో నిధులను ఇస్తోన్నా, కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన స్థాయిలో నిధులు రావడం లేదని కెసిఆర్ నిప్పులు చెరిగారు.
సంఘాలతో నేరుగా సమావేశాలు
పలు కార్మిక సంఘాలు, ఉద్యోగులు, కుల సంఘాలతో ప్రగతి భవన్లో కెసిఆర్ ఈ ఏడాదిలో పలు సార్లు సమావేశమయ్యారు. కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులు, హోమ్ గార్డులు, బిసి సంఘాలు, యాదవ సంఘాలు, సింగరేణి కార్మికులతో పలు దఫాలు కెసిఆర్ సమావేశమయ్యారు.ఆయా సంఘాల డిమాండ్లకు అనుకూలంగా నిర్ణయాలను ప్రకటించారు.