తెలంగాణలో కొత్తగా 207 కరోనా కేసులు: తగ్గిన రికవరీ, ఏడు జిల్లాల్లో సున్నా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసులు ఎక్కువ తక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా 42,108 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 207 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది.
తాజాగా, నమోదైన 207 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,70,139కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3946గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. కాగా, మరో 1595 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.
గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 184 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,62,209కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3984 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 01, భద్రాద్రి కొత్తగూడెంలో 04, జీహెచ్ఎంసీలో 38. జగిత్యాలలో 05, జనగామలో 07, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 01, కామారెడ్డిలో 00, కరీంనగర్లో 22, ఖమ్మంలో 15, కొమురంభీం ఆసిఫాబాద్ లో 00, మహబూబ్నగర్లో 07, మహబూబాబాద్లో 06, మంచిర్యాలలో 13, మెదక్లో 00, మేడ్చల్ మల్కాజ్గిరిలో 09, ములుగులో 01, నాగర్ కర్నూలులో 03, నల్గొండలో 06, నారాయణపేటలో 00, నిర్మల్లో 00, నిజామాబాద్లో 01, పెద్దపల్లిలో 07, రాజన్న సిరిసిల్లలో 04, రంగారెడ్డిలో 17, సంగారెడ్డిలో 03, సిద్దిపేటలో 05, సూర్యాపేటలో 09, వికారాబాద్ లో 01, వనపర్తిలో 00, వరంగల్ రూరల్లో 07, వరంగల్ అర్బన్లో 12, యాదాద్రి భువనగిరిలో 03 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం అసిఫాబాద్, మెదక్, నారాయణపేట, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
మరోవైపు, దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 13.64 లక్షల నమూనాలను పరీక్షించగా.. 16,326 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,59,562కి పెరిగింది. అంతకుముందు రోజు కంటే 3.42 శాతం కేసులు ఎక్కువ కావడం గమనార్హం. కాగా, తాజాగా, మరణాలు భారీగా పెరిగాయి. శుక్రవారం 666 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఒక్క కేరళ రాష్ట్రంలోనే 563 మరణాలు సంభవించడం గమనార్హం. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,53,708కు చేరింది. శుక్రవారం 17,677 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.35 కోట్లకు పెరిగింది. రికవరీ రేటు 98.16 శాతానికి పెరిగింది. 2020 మార్చి తర్వాత ఇదే గరిష్ట రికవరీ రేటు కావడం గమనార్హం. కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో 233 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి యాక్టివ్ కేసులు. ప్రస్తుతం దేశంలో 1,73,728 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. శుక్రవారం 68.48 లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 1.01 కోట్ల డోసుల పంపిణీ జరిగింది.