తెలంగాణలో కొత్తగా 209 కరోనా కేసులు.. మరో 9 మంది మృతి..
తెలంగాణలో కొత్తగా 209 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4320కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 165కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఇవాళ నమోదైన కేసుల్లోనూ జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 175 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్లో 10, రంగారెడ్డిలో 7, కరీంనగర్ మహబూబ్ నగర్లో 3 చొప్పున, వరంగల్ అర్బన్, అసిఫాబాద్, సిద్దిపేటలో 2 చొప్పున, ములుగు, కామారెడ్డి, వరంగల్ రూరల్, సిరిసిల్లలో ఒక్కో కేసు నమోదయ్యాయి.
ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 449 మంది విదేశాలు,ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు,వలస కార్మికులు ఉన్నారు. ఇప్పటివరకూ 1993 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.ప్రస్తుతం 2162 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలో మృతుల సంఖ్య ప్రతీ రోజూ 5కి పైనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఆదివారం (జూన్ 7) రాష్ట్రంలో అత్యధికంగా 14 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.