పవర్ కట్ వల్లనా?: గాంధీ ఆసుపత్రిలో ఒక్క రోజే 21 మంది మృతి
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని మహాత్మా గాంధీ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. గత శుక్రవారం నాడు ఒక్క రోజే 21 మంది పసికందులు మృతి చెందినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా సర్జికల్, నియోనల్ ఇంటెన్సివ్ కేర్లో ఉన్నవారు మృతి చెందినట్లుగా తెలుస్తోందంటున్నారు.
అయితే, విద్యుత్ సరఫరా లేకపోవడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఇదంతా దుష్ప్రచారమని ఆసుపత్రి వర్గాలు చెబుతన్నాయి. సాధారణంగా గాంధీ ఆసుపత్రిలో రోజుకు పదిమంది వరకు మృతి చెందుతుంటారని అంటున్నారు.
మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కరెంట్ ట్రిప్ అయిందని, ఆ సమయంలో రెగ్యులర్ ఇన్వెర్టర్స్ నడిచాయని తెలుస్తోంది. పద్నాలుగేళ్లుగా తాను ఈ ఆసుపత్రిలో పని చేస్తున్నానని, రోజుకు పది మంది పేషెంట్లు చనిపోతుంటారని డాక్టర్ రఘు చెప్పారని అంటున్నారు.
అదే సమయంలో చనిపోయిన 21 మంది పవర్ కట్ వల్లే చనిపోయారా, ఇతర కారణాలు ఉన్నాయా చూస్తామని, ప్రత్యక్షంగా, పరోక్షంగా విద్యుత్ కారణమా చూస్తామని మరొకరు అంటున్నారు. సదరు డాక్టర్ ఆసుపత్రిలో ఆ రోజు రాత్రి పన్నెండున్నర గంటల వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది.