తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు: పెరిగిన రికవరీ, 4500కు యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. అంతకుముందు రోజు కంటే కూడా ఎక్కువ కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటల్లో 44,584 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 216 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.
తాజాగా, నమోదైన 218 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,65,284కు చేరింది. కరోనాతో కొత్తగా ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3914గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1308 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.
గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 241 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,56,785కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4585 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.
మరోవైపు దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా, 30 వేలకు దిగువనే కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం భారత్ లో గత 24 గంటల్లో 26,041 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి . దీంతో ఇప్పటి వరకు భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,36,78,786 కు పెరిగింది.
గత 24 గంటల్లో దేశంలో 29,621 రికవరీలు నమోదు కాగా, దీంతో మొత్తం దేశంలో ఇప్పటి వరకు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 3,29,31,972 కి చేరుకుంది. దేశంలో రికవరీ రేటు 78.89 శాతంగా ఉంది. గత 24 గంటల్లో దేశంలో 276 మరణాలు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం మొత్తం మరణాల సంఖ్య 4,47,194 గా నమోదైంది. ఇక ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,99,620 గా ఉన్నాయి. కరోనా యాక్టివ్ కేసులు తగ్గటం కాస్త ఊరటనిస్తుంది. కరోనా యాక్టివ్ కేసులు 0.90 శాతం గా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోని 1,63,855 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో గత 24 గంటల్లో 38,18,362 మందికి వ్యాక్సిన్ డోసులను ఇచ్చారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఇచ్చిన మొత్తం టీకాల సంఖ్య 86,01,59,011 గా ఉంది. ఇదిలా ఉంటే గడచిన 24 గంటల్లో 11,65,006 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.