21వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్: ఆందోళన చేస్తూ కిందపడిన నారాయణ
హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసీసీ వేదికగా ప్రారంభమైన జీఎస్టీ 21వ మండలి సమావేశాన్ని అడ్డుకునేందుకు వామపక్షాలు ప్రయత్నించాయి. సీపీఐ నేత నారాయణ ఆధ్వర్యంలో పలువురు నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
హైదరాబాద్: నగరంలోని హెచ్ఐసీసీ వేదికగా ప్రారంభమైన జీఎస్టీ 21వ మండలి సమావేశాన్ని అడ్డుకునేందుకు వామపక్షాలు ప్రయత్నించాయి. జీఎస్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాయి. సీపీఐ నేత నారాయణ ఆధ్వర్యంలో పలువురు నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
కాగా, నారాయణతోపాటు నేతలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, వామపక్ష నేతలకు మధ్య జరిగిన తోపులాటలో నారాయణ కిందపడిపోయారు. ఆయనను పైకి లేపిన పోలీసులు పోలీసు వాహనంలో తరలించారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు అరుణ్ జైట్లీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
అంతకుముందు నారాయణ మాట్లాడుతూ.. జీఎస్టీతో సామాన్యులకు ప్రయోజనం ఏమీ లేకుండా పోయిందని అన్నారు. ఈ విషయంలో కేంద్రంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేయాలని అన్నారు. రఘురాం రాజన్ చెప్పిన సూచనలను తీసుకోవాలని, జీఎస్టీని సవరించాలని నారాయణ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి వంతపాడటం సరికాదని అన్నారు.
జీఎస్టీ సమావేశాలు ప్రారంభం
21వ జీఎస్టీ మండలి సమావేశం హైదరాబాద్లో ప్రారంభమైంది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత కీలకాంశాల అజెండాగా ఈ సమావేశం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్జైట్లీ, సహాయ మంత్రి శుక్లాకు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఘన స్వాగతం పలికారు. సాయంత్రం 5 గంటల వరకూ హెచ్ఐసీసీలో ఈ సమావేశం జరగనుంది.
ఇరిగేషన్ ప్రాజెక్టులకు జీఎస్టీని మినహాయించాలి : ఈటల
జీఎస్టీ విషయంలో తెలంగాణ రాష్ర్టం తరపున 33 అంశాల్లో అభ్యంతరాలు ఉన్నాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. జీఎస్టీ సమావేశం ప్రారంభం కంటే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు జీఎస్టీని రెండేళ్ల పాటు మినహాయించాలని కోరుతామని తెలిపారు. సమస్యలన్నింటినీ జీఎస్టీ ముందు ఉంచుతామని చెప్పారు. 12 శాతం జీఎస్టీతో కొన్ని వర్గాలు, రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు.