మళ్లీ డబుల్ డిజిట్.. తెలంగాణలో కొత్తగా 22 కరోనా పాజిటివ్ కేసులు..
తెలంగాణలో గురువారం(ఏప్రిల్ 30) కొత్తగా మరో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1038కు చేరింది. గత మూడు రోజులుగా సింగిల్ డిజిట్కే పరిమితమైన కేసులు.. ఈరోజు డబుల్ డిజిట్లోకి రావడం గమనార్హం. కరోనా కారణంగా ఇప్పటివరకూ 28 మంది మృతి చెందగా.. 442 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 568 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. దాదాపు 11 జిల్లాల్లో ఒక్క కరోనా యాక్టివ్ కేసు కూడా లేదు.
గురువారం కరోనాతో మృతిచెందినవాళ్లలో హైదరాబాద్ రామంతాపూర్కి చెందిన వ్యక్తి(48) ఒరు ఉన్నారు. గాంధీ ఆసుపత్రిలో చేరిన 12 గంటల్లోపే అతను మృతి చెందారు. కొంతకాలంగా అతను షుగర్,బీపీ,స్థూలకా య సమస్యలతోనూ బాధపడుతున్నట్టు సమాచారం. వనస్థలిపురంకు చెందిన ఓ వృద్దుడు(70) కూడా కరోనాతో మృతి చెందాడు. అప్పటికే షుగర్, బీపీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వృద్ధుడిని మంగళవారం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
జియాగూడలోని దుర్గానగర్కి చెందిన ఓ మహిళ(44) కూడా కరోనాతో మృతి చెందారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్టు సమాచారం. అప్పటికే బీపీ, షుగర్,న్యుమోనియాతో సమస్యలతోనూ ఆమె బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే,కరోనావైరస్ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వ తీసుకుంటున్న చర్యల పట్ల కేంద్రం ప్రశంసలు కురిపించింది. గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వ బృందం తెలంగాణలో పర్యటిస్తున్న విషయం నేపథ్యంలో.. ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా కట్టడి చర్యలను పరిశీలించింది. పేషెంట్లకు అందుతున్న చికిత్స, అందిస్తున్న సౌకర్యాల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రశంసించడం సంతోషం అని వైద్యారోగ్య శాఖ మంత్రి మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కరోనా వైద్య పరీక్షల మీద,ల్యాబ్ల పనితీరు మీద హోం శాఖ జాయింట్ సెక్రెటరీ శ్రీమతి సలీల శ్రీవాత్సవ ప్రశంశలు కురిపించారని తెలిపారు.