యూకేలో మిస్సింగ్: ఇంకా దొరకని బీజేపీ నేత కుమారుడి ఆచూకీ, కన్నీరుమున్నీరు
హైదరాబాద్: ఆగస్టు 21న లండన్లో అదృశ్యమైన తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేత కుమారుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. యూనైటెడ్ కింగ్డమ్(యూకే)లో ఎంఎస్ చేస్తున్న తన కుమారుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదని ఆ 23ఏళ్ల యువకుడి తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు.
ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సన్నే ఉదయ్ ప్రతాప్ కుమారుడు ఉజ్వల్ శ్రీహర్ష యూకేలో ఎంఎస్ చేస్తున్నాడు. ఆగస్టు 21న లండన్ నుంచి ఖమ్మంలోని తన తల్లి, హైదరాబాద్ నగరంలోని చెల్లి ఐశ్వర్యతో ఫోన్ చేసి మాట్లాడారు. అయితే, ఆ తర్వాత అతని ఆచూకీ తెలియకుండా పోయింది.
ఈ క్రమంలో మిస్సింగ్ కేసు నమోదు చేసిన లండన్ పోలీసులు.. శుక్రవారం సాయంత్రం ఖమ్మంలోని ఉదయ్ ప్రతాప్కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఉజ్వల్ బ్యాగ్ బీచ్ వద్ద దొరికిందని తెలిపారు. హైదరాబాద్ బిట్స్ పిలానీలో బీటెక్ చదివిని శ్రీహర్ష.. లండన్లోని క్వీన్ మేరీ యూనివర్సిటీలో ఎంఎస్ చదివేందుకు యూకే వెళ్లాడు.
మరికొద్ది రోజుల్లోనే యూనివర్సిటీ నుంచి ఎంఎస్ విద్య పూర్తయిన ధృవపత్రాలు తీసుకుని తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్న శ్రీహర్ష కుటుంబసభ్యులకు.. మిస్సింగ్ అంటూ ఫోన్ రావడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తన కొడుకు ఆచూకీ తెలియరాలేదంటూ ప్రతాప్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన కొడుకు చదువులో ఎప్పుడూ ముందుండేవాడని చెప్పారు.
ఇటీవల ఓ ప్రాజెక్టుపై జపాన్ వెళ్లిన ఉజ్వల్ శ్రీహర్షకు.. సైంటిస్ట్ కావాలనేది లక్ష్యమని తెలిపారు. కాగా, కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి శ్రీహర్ష మిస్సింగ్ విషయం తెలియడంతో ప్రతాప్కు ఫోన్ చేసి మాట్లాడారు. తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మాజీ కేంద్రమంత్రి దత్తాత్రేయ కూడా ప్రతాప్తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.