నిరంతర విద్యుత్ .. సంక్షేమమే మా ప్రాధాన్యం .. అసెంబ్లీలో సీఎం కేసీఆర్
హైదరాబాద్ : ద్రవ్య వినిమయ బిల్లును సీఎం కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మిషన్ భగీరథతో మొదలైన మాటల మంటలు సబ్ ప్లాన్, ప్రాజెక్టులు, భూ రికార్డుల అంశాల వారీగా జరిగింది. విపక్షాలు లేవనెత్తిన అంశాలకు సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు కేసీఆర్. ఆ తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అప్రొప్రియేషన్ బిల్లుకు ఆమోదం తెలిపాక సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చపై వన్ ఇండియా ప్రత్యేక కథనం.
ఆకుపచ్చ తెలంగాణ
రాష్ట్రంలో వ్యవసాయం బ్రహ్మండంగా సాగుతోంది. రైతుల సంక్షేమ కోసం ప్రవేశపెట్టిన పథకాలతో మేలు జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం విద్యుత్ సరఫరా. దేశంలో ఏ రాష్ట్రం చేయనివిధంగా రైతులకు 24 గంటలపాటు నిరంతర కరెంట్ ఇస్తుంది తెలంగాణ రాష్ట్రమేనని స్పష్టంచేశారు. రిజర్వేషన్లపై పేచీకి కారణం కాంగ్రెస్ నేతలనే మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించింది స్వర్గీయ ఎన్టీఆరేనని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ తీసుకొచ్చామన్నారు. చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని శాసనసభ తీర్మానం చేసి పంపించినా అప్పటి మన్మోహన్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
అప్పడు 19 .. ఇప్పుడు 280
కాంగ్రెస్, టీడీపీ హయాంలో బీసీ రెసిడెన్షియల్స్ 19 ఉండేవని .. తెలంగాణ ఏర్పడిన నాలుగున్నరేళ్లలో అవి 280 చేరాయన్నారు. బీసీలపై నిజమైన ప్రేమ అని కాంగ్రెస్ నేతలనుద్దేశించి ప్రశ్నించారు. త్వరలో మరో 119 నెలకొల్పుతామని సభాముఖంగా ప్రకటించారు. అలాగే రాష్ట్రానికి ఏయిమ్స్ వచ్చిందని .. రూ.1028 కోట్ల నిధులు కూడా కేటాయించారి పేర్కొన్నారు.
మీ హయాంలో అన్నీ అక్రమాలే
కాంగ్రెస్ హయాం అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. మిషన్ భగీరథ ద్వారా నీరిచ్చే కాంట్రాక్టర్ .. ఏ రిపేర్ వచ్చినా వారిదే బాధ్యతని స్పష్టంచేశారు. మీ హయాంలో ఇలాంటి చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. మైనర్, మేజర్ ఇరిగేషన్ ను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో 22 వేల చెరువులను బాగుచేశామన్నారు. దీంతో భూగర్భ జలాలు ఏటీకేడు పెరుగుతున్నాయన్నారు. ఫీడర్ చానెల్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి లింక్ కూడా ఇస్తున్నామని చెప్పారు.
తమ్మిడిహట్టిలో తట్టేడు మట్టి తవ్వలేదు
తమ్మడిహట్టి ప్రాజెక్టు కోసం అంకురార్పణ చేసిన కాంగ్రెస్ సర్కార్ .. తట్టేడు మట్టి తవ్వలేదని విమర్శించారు. 150 టీఎంసీల పేరుతో కడుతోన్న ప్రాజెక్టు సామర్థ్యాన్ని 400 టీఎంసీలు పెంచామన్నారు. ప్రాజెక్టుల అంటే ఓర్వని కాంగ్రెస్ నేతలు 200 కేసులు వేశారని మండిపడ్డారు. అంబేద్కర్ సుజల స్రవంతి అని 14 టీఎంసీల సామర్థ్యంతో 16 లక్షల ఎకరాలకు నీరిస్తామని చెప్పారని .. అదెలా సాధ్యమని ప్రశ్నించారు. అదేవిధంగా సీతారామా ప్రాజెక్టుతో ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని స్పష్టంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో .. మొత్తం 16 వేల మంచినీటి ట్యాంకులు ఉండేవన్నారు. మేం అధికారంలోకి వచ్చాక 22 వేల ట్యాంకులు నిర్మించడంతో ఆ సంఖ్య 38 వేలకు చేరుకుందని .. దీంతో ఇంటింటికీ సురక్షిత మంచినీరు సాధ్యమవుతోందన్నారు.