రాష్ట్రంలో పెరిగిన 24 లక్షల ఓటర్లు .. ఓటర్ల రేషియో కూడా పెరిగింది : సీఈసీ రజత్ కుమార్
హైదరాబాద్ : రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యింది. మొత్తం 2.95 కోట్ల ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే వివిధ కారణాల వల్ల 1.95 లక్షల ఓట్లను తొలగించినట్టు స్పష్టంచేసింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ శుక్రవారంతో ముగియడంతో సీఈసీ రజత్ కుమార్ ఓ ప్రకటనలో ఓటర్ల వివరాలను విడుదల చేశారు.
గణనీయంగా పెరిగిన ఓటర్లు ..
గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలీస్తే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. దాదాపు 24 లక్షల మంది ఓటర్లు పెరిగారని ఈసీ తెలిపింది. ఇందులో కొత్తగా ఓటు నమోదు చేసుకున్న ఓటర్లే ఎక్కువ ఉన్నారని పేర్కొన్నది. ఓటర్ల జాబితా సవరణ తర్వాత రాష్ట్రంలో 2 కోట్ల 95 లక్షల, 18 వేల 964 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించింది.
లోక్ సభ కోసం స్పెషల్ డ్రైవ్
వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వచ్చేనెలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. మార్చి 2, 3 తేదీల్లో మరోసారి అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత జరిగే మార్పు చేర్పులతో మరికొంత ఓటర్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.
పెరిగిన ప్రజలు-ఓటర్ల రేషియా
గతంలో పోలిస్తే రాష్ట్రంలో ప్రజలు ఓటర్ల రేషియో పెరిగింది. ఇదివరకు రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందికి 738 మంది ఓటర్లుండగా .. ప్రస్తుతం ఆ సంఖ్య 762కు పెరిగింది. అదేవిధంగా స్త్రీ, పురుషుల నిష్పత్తి కూడా పెరిగింది. గతంలో ప్రతి వెయ్యిమంది పురుషులకు 982 మంది మహిళా ఓటర్లుండగా .. ప్రస్తుతం ఆ సంఖ్య 989కి పెరిగింది.
1.95 లక్షల ఓట్ల తొలగింపు
ఓటర్ల జాబితా సవరణలో భాగంగా లక్షా 95 వేల 369 మంది ఓటర్లను తొలగించినట్టు రజత్ వెల్లడించారు. ఇందులో 44 వేల 721 మంది చనిపోయిన వారి పేర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ కోసం 26.24 లక్షల మంది ఆప్లై చేసుకున్నారు. పరిశీలన అనంతరం 23 లక్షల 78 వేల 764 దరఖాస్తులను ఆమోదించి .. అందులోంచి వివిధ కారణాల వల్ల 2 లక్షల 45 వేల 89 దరఖాస్తులను తిరస్కించారు. దీంతో 19 లక్షల 15 వేల 240 మంది ఓటర్లు కొత్తగా చేరినట్టైంది.