బిర్యానీ ఆశ చూపి.. : యువతిపై గ్యాంగ్ రేప్..
హైదరాబాద్ : రాత్రి పూట విధుల సమయంలో బిర్యానీ కోసం బయటకొచ్చిన ఓ యువతిపై గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు కొంతమంది దుండగులు. కాగా, యువతి ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులపై 376-D కేసు నమోదు చేశారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. చైతన్యపురి సమీపంలోని రాజీవ్ గాంధీ కాలనీలో ఉన్న స్థానిక ఆసుపత్రిలో రాత్రి పూట విధులు నిర్వర్తిస్తోంది బాధిత యువతి. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి బిర్యానీ పార్సిల్ తీసుకెళ్లడం కోసమై స్థానిక హోటల్ దగ్గరికెళ్లింది యువతి. అయితే అప్పటికే హోటల్ మూసేయడంతో, చేసేదేం లేక తిరిగి ఆసుపత్రి బాట పట్టింది.
కాగా, యువతి ఆసుపత్రికి వస్తున్న క్రమంలో.. బైక్స్ పై సంచరిస్తున్న స్థానిక రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన యువకులు నాగేష్ (20), ప్రభాకర్(22), కుశాల్ నాయక్(21), ఆమెతో మాటలు కలిపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తమతో వస్తే బిర్యానీ ఇప్పిస్తామని యువతిని నమ్మించే ప్రయత్నం చేశారు. సదరు యువకుల మాటలు నమ్మిన యువతి వాళ్లతో పాటు వెళ్లడానికి అంగీకరించింది.
దీంతో 11:30 గంటల ప్రాంతంలో యువతిని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లిన నిందితులు ఆమెపై అత్యాచారం చేశారు. అయితే విషయం స్థానికులకు తెలియడంతో వాళ్లంతా అక్కడికి చేరుకునేలోపే నిందితులు పరారయ్యారు.
తర్వాత పోలీసులను ఆశ్రయించిన యువతి నిందితులపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం యువతిని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. చైతన్యపురి ఇన్ స్పెక్టర్ గురురాఘవేంద్ర మాట్లాడుతూ.. బాధిత యువతి నిందితులందరిని గుర్తు పట్టిందని, వారంతా స్థానికంగా ఉండే ఓ ఫంక్షన్ హాల్ లో పనిచేస్తున్నారని తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు.