తెలంగాణలో కొత్తగా 2511 కరోనా కేసులు... మరో 11 మంది మృతి...
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 2511 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 305 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో 11 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,38,395కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 877కి చేరింది. ప్రస్తుతం 32,915 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో 2,578 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,04,603కు చేరింది. గడిచిన 24గంటల్లో మొత్తం 62,132 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 16,67,653కు చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 184,నల్గొండ జిల్లాలో 170,కరీంనగర్ జిల్లాలో 150,ఖమ్మం జిల్లాలో 140,మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 134, కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో లక్షణాలు లేనివి 96,493 కాగా లక్షణాలు ఉన్న కేసులు 42,902 ఉన్నాయి. ప్రస్తుతం 11,511 రెగ్యులర్ బెడ్స్,4602 ఆక్సిజన్ బెడ్స్,1553 ఐసీయూ బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. కరోనా పట్ల ప్రజలు భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని.. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని నయం చేయవచ్చునని తాజా బులెటిన్లో ఆరోగ్యశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.