తెలంగాణలో భారీగా నమోదైన కరోనా కేసులు.. మరో 8 మంది మృతి..
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అంతకంతకూ విజృంభిస్తున్నాయి. శనివారం(జూన్ 13) రికార్డు స్థాయిలో 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 8 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనా కేసులు 4737కి చేరాయి. ఇప్పటివరకూ మొత్తంగా 182 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 2,203 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుల చేసింది.
తాజాగా నమోదైన కేసుల్లోనూ జీహెచ్ఎంసీలోనే అత్యధికంగా 179 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డిలో 24, మేడ్చల్లో 14, రంగారెడ్డి 11, మహబూబ్నగర్ 4, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, నల్లగొండ, ములుగు, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో రెండేసి చొప్పున నమోదయ్యాయి. సిద్దిపేట, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, నాగర్కర్నూల్, కామారెడ్డి, జగిత్యాలలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.రాష్ట్రంలో గత రెండు వారాలుగా ప్రతీ రోజూ మరణాలు 5కి తగ్గట్లేదు. గురు(జూన్ 11),శుక్ర వారాల్లో 9 మంది మరణించగా.. శనివారం 8 మంది మృత్యువాత పడ్డారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కూడా కరోనా పాజిటివ్గా తేలిన సంగతి తెలిసిందే. ముత్తిరెడ్డి సతీమణి పద్మ లతా రెడ్డి,డ్రైవర్,గన్మెన్,వంట మనిషికి కూడా కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ప్రస్తుతం ముత్తిరెడ్డి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హరీష్ రావు పీఏకి కరోనా పాజిటివ్గా తేలడంతో ఆయన కూడా హోమ్ క్వారెంటైన్ అయ్యారు.
Recommended Video
హైదరాబాద్లో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో నగరంలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం దీనిపై ఆలోచిస్తోందని.. మరో రెండు,మూడు రోజుల్లో ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని వెల్లడించారు.