ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని.. పొగ వేసుకుని మహిళా టెక్కీ ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదని మనస్తాపం చెందిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్కు చెందిన లిపిశర్మ(26) గచ్చిబౌలి డీఎల్ఎఫ్ ఐటీ పార్క్లోని టిప్కో కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. కొండాపూర్లోని ఓ అపార్టుమెంట్లోని ఫ్లాట్లో స్నేహితురాళ్లతో కలిసి ఉంటోంది. లిపిశర్మ.. ఆనంద్ అనే ఓ యువకుడిని ప్రేమించింది.
అతను ప్రస్తుతం సింగపూర్లో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరి పెళ్లి విషయమై లిపిశర్మ తన తల్లిదండ్రులకు చెప్పగా వారు అంగీకరించలేదు. కులాంతర వివాహం వద్దని మందలించారు. మనస్తాపం చెందిన ఆమె చనిపోవాలని నిర్ణయించుకుంది. శనివారం రాత్రి తన గదిలో రెండు ఇనుప ప్లేట్లలో మంట వేసుకొని అందులో కర్పూర బిళ్లలు వేసింది.
దీంతో గది నిండ పొగ వ్యాపించి ఊపిరాడక మృతిచెందింది. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో పక్క గదిలో నిద్రిస్తున్న స్నేహితులు లేచి చూడగా లిపిశర్మ తలుపులు మూసి ఉన్నాయి. ఎంత తట్టిన తలుపులు తీయకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలగొట్టి లోపలికి వెళ్లిచూడగా ఆమె విగత జీవిగా పడివుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారిని ఎదిరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యేకు గుండెపోటు
హైదరాబాదులోని కంటోన్మెంట్ టిడిపి ఎమ్మెల్యే సాయన్న అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం ఆయన గుండెపోటు రాగా. కుటుంబసభ్యులు హుటాహుటిన హైదర్గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.