కులవృత్తులకు పూర్వవైభవం: 3 కోట్లకుపైగా తాటి, ఈత మొక్కలను నాటం: మంత్రి శ్రీనివాస్..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కులవృత్తులకు పూర్వ వైభవం దక్కిందని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయా కులవృత్తులకు చెందిన వారి జీవితాల్లో చీమ్మ చీకట్లను పారదొలి వెలుగులను నింపుతున్నామని చెప్పారు. సోమవారం చేవెళ్ల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం జరిగింది.
చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలో ఆబ్కారి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు తాటి, ఈత మొక్కలను నాటారు. తర్వాత చేవెళ్ల మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన స్టేషన్ను మంత్రి సబిత ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో 3 కోట్ల 75 లక్షల తాటి, ఈత మొక్కలను నాటామని మంత్రి తెలిపారు.
ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 2 వేల మొక్కలు నాటుతున్నామని చెప్పారు. ప్రజల ఆరోగ్యం కోసం నీరా పాలసీ ని ప్రవేశపెట్టామని మంత్రి తెలిపారు. ఆబ్కారి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 98 ఆబ్కారి స్టేషన్లుకు నూతన భవనాల నిర్మాణం చేస్తున్నామని వివరించారు. 48 స్టేషన్ల నూతన భవనాల నిర్మాణ దశలో ఉన్నాయని.. వాటిలో 14 స్టేషన్లను ప్రారంభించామన్నారు.
రంగారెడ్డి జిల్లాలో తొలి ఆబ్కారి శాఖ స్టేషన్ నిర్మాణాన్ని చేవెళ్లలో ప్రారంభించామని తెలిపారు. సీఎం కేసీఆర్ గారి ఆదేశాలతో రాష్ట్రం గుడుంబా రహిత రాష్ట్రం గా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖల కార్యాలయాల, ఉద్యోగుల పట్ల ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురయ్యామని.. కానీ స్వరాష్ట్రంలో పూర్వ వైభవం దక్కుతోందని తెలిపారు.