కొత్తగూడెం వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి, మరో ముగ్గురికి గాయాలు
హైదరాబాద్:రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ మండలం కొత్తగూడెం వద్ద సోమవారం తెల్లవారు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా హైద్రాబాద్ రామాంతపూర్కు చెందినవారుగా పోలీసులు ప్రకటించారు.
భారీ దుంగలతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. అయితే వెనుక వస్తున్న కారు మీద ఈ దుంగలు పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులను రామంతాపూర్కు చెందిన స్వప్ప, మణికాంత్, పద్మగా గుర్తించారు.
పోచంపల్లి నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారుపై దుంగలు పడ్డాయి.దీంతో కారులో ప్రయాణీస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.మృతులు, బాధితులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఘటన అనంతరం లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.