ఫలితాలపై ఆత్రం, విద్యార్థుల జీవితాలతో చెలగాటం.. ఇంటర్ బోర్డు తీరుపై గవర్నర్ నజర్
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలను ఆగం చేసింది. గతేడాది కన్నా ఇచ్చిన తేదీ కన్నా ముందే, ఏపీతో పోటీ పడి ఫలితాలు ఇవ్వాలన్న తపనతో స్టూడెంట్స్ జీవితాలతో చెలగాటమాడింది. ఫలితంగా అటు ఫలితాలు త్వరగా విడుదల చేయక ఇటు లోపాల్లేకుండా రిజల్ట్ ఇవ్వడంలో ఘోరంగా విఫలమైంది. మార్కులు, ఫలితాలు తలకిందులు కావడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, పేరెంట్స్ ఆందోళన బాట పట్టారు.
ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డ్ అట్టర్ ఫ్లాప్!.. సున్నా మార్కులొచ్చిన నవ్య డిస్టింగ్షన్లో పాస్!
ఇంటర్ బోర్డు తీరుపై గవర్నర్ ఆరా
ఇంటర్ బోర్డు నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తడంతో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తప్పుల తడకల రిజల్ట్స్కు కారణమెవరో తెలుసుకునే పనిలో పడ్డారు. విద్యాశాఖ అధికారులతో సమావేశమైన ఆయన.. సబ్జెక్టులవారీగా ఉత్తీర్ణులు కానివారి సంఖ్యపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
కమిటీ ఏర్పాటుచేసిన ప్రభుత్వం
ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంపై రాష్ట్ర సర్కారు స్పందించింది. ఇంటర్ ఫలితాల్లో అవకతవకల వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆ శాఖ కార్యదర్శి, ఇతర అధికారులతో సమీక్షించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో కమిటీ నియమించినట్లు ప్రకటించారు. కమిటీ సభ్యులుగా హైదరాబాద్ బిట్స్ ఫ్రొఫెసర్ వాసన్, ఐఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిశాంత్ను నియమించారు. కొంతమంది అధికారుల అంతర్గత తగాదాలతో ఫలితాలపై అపోహలు ఏర్పడ్డాయని జగదీష్ రెడ్డి చెప్పారు.
మూడు రోజుల్లో నివేదిక
తప్పుల తడకల ఫలితాలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు ఏర్పాటుచేసిన కమిటీ మూడు రోజుల్లో నివేదిక ఇస్తుందని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మూడు రోజుల్లో వెలుగులోకి రానున్న వాస్తవాలతో అపోహలన్నీ తొలిగిపోతామని చెప్పారు.
తప్పు ఒప్పుకోని ఇంటర్ బోర్డు
ఇంటర్ ఫలితాలపై ఇంత రచ్చ జరుగుతున్నా బోర్డు కార్యదర్శి మాత్రం తమ తప్పేమీలేదంటున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆదివారం బోర్డు కార్యదర్శి అశోక్ విడుదల చేసిన ప్రకటన అందరినీ విస్మయపరిచింది. 21వేల మంది విద్యార్థుల మార్కులు గల్లంతైనట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమని, జవాబు పత్రాలను అర్హతలేని వారితో మూల్యాంకనం చేయించారనడంలో నిజంలేదని చెప్పడం విశేషం.