కారు ప్రమాదం: ముగ్గురు టెక్కీలు మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు
నిర్మల్: జిల్లాలోని ఎల్లపెల్లి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళుతున్న ఏడుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఇన్నోవా వాహన టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని, పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు మరణించగా, మరో ముగ్గురు తీవ్రగాయాలతో నిజామాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారంతా కుంటాల జలపాతాన్ని సందర్శించుకుని తిరుగు ప్రయాణమవుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్కు చెందిన దినేశ్, కుసుమ, నిఖిత, శ్రీవిద్య, యోగేందర్, నవీన్లు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇన్నోవా వాహనంలో కుంటాల జలపాతం అందాలను, ప్రకృతి రమణీయతను వీక్షించడానికి ఆదివారం ఉదయం విహారయాత్రకు వచ్చారు.
తిరుగు ప్రయాణంలో నిర్మల్ జిల్లాలోని ఎల్లపెల్లి, కొండాపూర్ గ్రామ శివారుకు చేరుకోగానే ముందు టైరు పేలి వాహనం నాలుగైదు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో దినేశ్(30), కుసుమ(28), శ్రీవిద్య(29)లు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
క్షతగాత్రులకు నిర్మల్లోని ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సను అందజేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాదుకు తరలించారు. ప్రమాద విషయం తెలియగానే డీఎస్పీ మనోహర్రెడ్డి, నిర్మల్ గ్రామీణ సీఐ జీవన్రెడ్డిలు ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కాగా, అతివేగం కూడా ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. సీటు బెల్టు పెట్టుకోని కారణంగా ప్రమాద సమయంలో కారులో బెలూన్ తెరుచుకున్నప్పటికీ డ్రైవర్ స్థానం ఉన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.