విదేశాల్లో విషాదంగా మారిన క్రిస్మస్ వేడుక: అమెరికాలో ముగ్గురు నల్గొండ టీనేజ్ విద్యార్థులు మృతి
హైదరాబాద్/వాషింగ్టన్: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లిన ముగ్గురు తెలంగాణ విద్యార్థులు అగ్ని ప్రమాదంలో చిక్కుకొని మృతి చెందారు. వారు గాఢనిద్రలో ఉన్న సమయంలో అర్ధరాత్రి పూట ఇంటికి నిప్పు అంటుకొని సజీవదహనమయ్యారు. ఈ దుర్గటన కొలిర్విలిలో జరిగింది.
క్రిస్మస్ వేడుకల్లో ఉండగా, జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం నలుగురు మృతి చెందారు. ఇందులో ముగ్గురు తెలంగాణవాసులు. అందరూ టీనేజ్ విద్యార్థులే. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. తోబుట్టువులు. ఈ దుర్ఘనతో నల్గొండ జిల్లాలోని వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ముగ్గురు మృతి
మృతి చెందిన వారిని సాత్విక నాయక్, సుహాస్ నాయక్, జయసుచితలుగా గుర్తించారు. వీరంతా పద్నాలుగేళ్ల నుంచి 17 ఏళ్ల వయస్సువారే. మృతులు ముగ్గురు నల్గొండ జిల్లా ఆడిశర్లపల్లి మండలం గుర్రపుతండాకు చెందినవారు. గుర్రపుతండా నల్గొండ జిల్లాలోని నేరడుగొమ్ము మండలంలో ఉంది. గుర్రపుతండాకు చెందిన శ్రీనివాస్ నాయక్, సుజాత నాయక్ కుమార్తెలు సాత్విక నాయక్ (16), జయసుచిత నాయక్ (13), కుమారుడు సుహాస్ నాయక్ (14)లు ఈ ప్రమాదంలో మృతి చెందారు.
చదువుకోవడానికి అమెరికా
వీరు చదువుకోవడానికి అమెరికా వెళ్లారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి అలంకరణ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చిన్నవయసులోనే దేశం కాని దేశంలో ప్రాణాలు కోల్పోవడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
శ్రీనివాస్ నాయక్ గతంలో అమెరికాలో పాస్టర్గా చేశారు
గుర్రపుతండాకు చెందిన శ్రీనివాస్ నాయక్ గతంలో అమెరికాలో పాస్టర్గా పనిచేశారు. ఆ తర్వాత నల్గొండకు వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లో స్థిర పడ్డారు. ఆయన ముగ్గురు పిలల్లు మాత్రం అమెరికాలో ఉంటున్నారు. వీరి కుటుంబానికి అక్కడి కొలిర్విలీలోని బైబిల్ చర్చిలో భాగస్వామ్యం ఉంది. ముగ్గురూ మిసిసిపీలోని ఓ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలకు సెలవులు ఇచ్చినా పిల్లలు తమ స్వదేశం భారత్కు వెళ్లకపోవడంతో చర్చి నడుపుతున్న క్రౌడ్రెట్ కుటుంబం వారిని తమ ఇంటికి ఆహ్వానించింది.
క్రిస్మస్ పండుగకు ఇంటిని అలంకరిస్తుంటే ప్రమాదం, మృతి
క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇంటిని అలంకరిస్తుండగా ప్రమాదం జరిగిందని అక్కడి చర్చి ఓ ప్రకటనలో తెలిపింది. ప్రమాదంలో ఆ ముగ్గురితో పాటు చర్చి నడుపుతున్న మహిళ కారీ క్రౌడెట్ మృతి చెందగా, ఆమె భర్త డేనియల్ కౌడ్రెట్, చిన్న కొడుకు కోల్లకు గాయాలయ్యాయి. విషయం తెలియగానే శ్రీనివాస్ నాయకు కుటుంబం హుటాహుటిన అమెరికాకు బయలుదేరింది.