నిర్బంధించి బాలికపై అఘాయిత్యం: తాగిన మత్తులో..
హైదరాబాద్: తాగిన మత్తులో ఓ కామాంధుడు మూడేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హైదరాబాదులోని రామచంద్రాపురంలో ఈ ఘటన జరిగింది. అనుమానితుడు పి. శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు.
బాధితురాలిని నిలోఫర్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె ప్రాణాలకు ముప్పు లేదని చెబుతున్నారు. బాలిక తన తల్లిదండ్రులతో మార్కెట్కు వెళ్లింది. తల్లిదండ్రులు సరుకుల కొనుగోలులో మునిగి ఉండగా, బాలిక తప్పిపోయింది.
ఓ తాగుబోతు బాలికను నిర్బంధించి, పక్కన ఉన్న పొదల్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. మార్కెట్లో కూతురి కోసం గాలించారు. కానీ వారి శ్రమ ఫలించలేదు. వారు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాత్రి 11 గంటల ప్రాంతంలో రక్తంతో తడిసిన దుస్తుల్లో ఏడుస్తున్న బాలిక బిహెచ్ఈఎల్ ఆర్టీసి ఉద్యోగులకు కనిపించింది. ఆమె పక్కన శ్రీనివాస్ కూడా కనిపించాడు. ఆర్టీసి ఉద్యోగులను చూడగానే అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.