30 రోజుల కార్యాచరణ ప్రణాళిక .. మా వల్ల కాదంటున్న గ్రామ కార్యదర్శులు
30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పని భారమంతా తమపైనే పడుతుందని, ఇంత ఒత్తిడి మా వల్ల కాదని గ్రామ కార్యదర్శులు లబోదిబోమంటున్నారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పేరుతో పని భారం మోపారని, గ్రామ ప్రజల భాగస్వామ్యం కానీ, ప్రజాప్రతినిధుల పట్టింపు కానీ ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లెనిద్ర చేయాలని తమకు సూచించి, మళ్లీ సాయంత్రానికి నివేదికలు అంటున్నారని ఈ ఒత్తిడి భరించలేక పోతున్నామంటూ గ్రామ కార్యదర్శులు ఆందోళన బాట పట్టారు.
ఎనలేని పనిభారంతో ఆందోళన బాట పట్టిన ఖమ్మం పంచాయితీ కార్యదర్శులు
ఊహించిందే జరిగింది. నిరంతరాయంగా జరగాల్సిన పనిని 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పేరుతో 30 రోజుల్లోనే పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ భావించి యుద్ధ ప్రాతిపదికన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇక దీనిపై ప్రతిరోజు నివేదికలు, వీడియో కాన్ఫరెన్స్ లు, సదస్సులు, సమావేశాలు, పల్లెనిద్ర అంటూ గ్రామ కార్యదర్శుల పై ఎనలేని పని భారం పడుతుంది. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న గ్రామ కార్యదర్శులు హఠాత్తుగా ఖమ్మం కలెక్టరేట్ ను ముట్టడించారు.
కలెక్టరేట్ వద్ద బైఠాయించి ఆందోళన .. పాల్గొన్న 400 మందికి పైగా కార్యదర్శులు
ఈ పని భారం తట్టుకోలేకపోతున్నామంటూ 400 మందికి పైగా గ్రామ కార్యదర్శులు కలెక్టరేట్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధుల మధ్య తాము నలిగిపోతున్నాం అని ఆవేదన చెందుతున్నారు. ఇక వీరితో పాటు 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కోసం గ్రామ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు స్పెషల్ స్క్వాడ్ దాడులు జరుగుతాయని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు.
ఉద్యమ బాట పట్టాలనే ఆలోచనలో పంచాయితీ కార్యదర్శులు
ఆదివారం రోజు కలెక్టరేట్ ముట్టడించడంతో పోలీసులు వారిని ఆదివారం కలెక్టర్ కు సెలవు అని సోమవారం నాడు కలవాలని సూచించారు. అయితే గ్రామ కార్యదర్శులు తమకు సెలవు లేకుండా పని చేస్తున్నామని లబో దిబో మన్నారు. చివరకు ఆందోళన విరమించారు. కానీ ఈ ఒత్తిడి ఇలా వుంటే ఉద్యమ బాట పట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇక సిద్దిపేటలోనూ గ్రామ కార్యదర్శులు సమావేశమయ్యారు.
ఇచ్చేది గౌరవ వేతనం .. చేయించేది వెట్టి చాకిరీ అని లబోదిబోమన్న పంచాయితీ కార్యదర్శులు
గౌరవ వేతనం ఇస్తున్న ప్రభుత్వం పరిమితికి మించి పని చేయిస్తోందని సిద్దిపేటలో సమావేశమైన గ్రామ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం టార్గెట్లు పెట్టి, పనితీరుపై నివేదికలు పేరుతో వేధిస్తోందని చర్చించారు. అంతే కాదు పని భారం ఎక్కువగా ఉంటే అధికారులు గంటల తరబడి సమావేశాలు నిర్వహించడం వల్ల పలు గ్రామాల్లో పనులు కుంటు పడుతున్నాయని తామేలాపని చెయ్యాలని ఆవేదన వ్యక్తం చేశారు .
పని ఒత్తిడి తో పంచాయితీ కార్యదర్శులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన
ఇటీవల పని ఒత్తిడి కారణంగానే ఇద్దరు కార్యదర్శులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఉన్నతాధికారులకు తమ సమస్యలు విన్నవించాలని, సమస్యలు పరిష్కారం కాకుంటే అందరూ సంఘటితంగా పోరు బాట పట్టాలని గ్రామ కార్యదర్శులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంవత్సరమంతా నిరంతరాయంగా చేయాల్సిన కార్యాచరణను, 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పేరుతో ఒకటే సారి చేయించాలనే ప్రభుత్వ ప్రయత్నం బెడిసికొట్టి గ్రామ కార్యదర్శులను పోరుబాట పట్టించేలా ఉంది.