కొంపముంచిన పానీపురి.. వాంతులు,విరేచనాలతో 30 మందికి అస్వస్థత..
అసలే కరోనా కాలం.. వీలైనంతవరకు ఇంటి నుంచి బయటకు వెళ్లకపోతే మంచిది. అత్యవసరమై వెళ్తే.. అనవసరంగా అక్కడా ఇక్కడా తిరగకుండా పని ముగించుకుని నేరుగా ఇంటికి వచ్చేయాలి. బయటి ఫుడ్కి దూరంగా ఉండటం ఉత్తమం. అలా కాకుండా సాధారణ రోజుల్లో లాగే ఇష్టమొచ్చినట్టు తిరగడం,బయటి తిండి తినడం చేస్తే కరోనా అంటుకునే ప్రమాదం లేకపోలేదు.
తాజాగా ఆదిలాబాద్లో ఇలాంటి ఘటనే జరిగింది. పట్టణంలోని ఖుర్షీద్ నగర్లో ఓ పానీ పురి బండి వద్ద పానీపురి తిన్న 30 మంది అస్వస్థతకు గురయ్యారు. కాలనీలోకి పానీపురి బండి రావడంతో రంజాన్ సందర్భంగా చిన్నా పెద్దా అంతా కలిసి పానీపురి తిన్నారు. కానీ కొద్దిసేపటికే వారికి వాంతులు విరోచనాలు మొదలయ్యాయి. దీంతో వెంటనే వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైనవారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ప్రజలు బయటి ఫుడ్ను తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
కాగా,తెలంగాణలో ఇప్పటివరకూ 1920 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటివరకూ 1164 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 700 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 56 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. గత మూడు,నాలుగు రోజులుగా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.