సౌదీలో బందీలుగా 30 మంది తెలంగాణా కార్మికులు ...కాపాడే నాధుడెవరు ?
Recommended Video
పొట్ట చేత పట్టుకుని సౌదీకి వెళ్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు నరకాన్ని చవిచూస్తున్నారు . అక్కడ నానా ఇబ్బందులు పడుతున్నారు. గల్ఫ్ దేశాల్లో తెలుగు వారి పరిస్థితి రోజురోజుకీ మరింత దయనీయంగా తయారవుతుంది. ఉన్న ఊరు కలిసిరాక, కరవు రక్కసి కాటేసిన చాలా ప్రాంతాల ప్రజలు గల్ఫ్ దేశాల్లో పొట్ట పోసుకునేందుకు వెళుతున్నారు.
అక్కడ వర్కింగ్ వీసా మీద వెళ్ళినా వారిని తీసుకెళ్ళిన ఏజెంట్లు , కంపెనీల మోసం కారణంగా వందల మంది వర్క్ పర్మిట్ రెన్యువల్ కాక ప్రభుత్వానికి జరిమానా కట్టలేక అక్కడ బందీలుగా మారుతున్నారు. ప్రస్తుతం సౌదీలో ఒకే గదిలో సంవత్సర కాలంగా బందీలుగా ఉన్న 30 మంది కార్మికుల దీన గాధ ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేస్తున్నా తమవారి కోసం పట్టించుకునే నాధుడి కోసం ఆ తెలంగాణా కార్మికుల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి.
సౌదీలో బందీలుగా సంవత్సర కాలంగా చీకట్లో మగ్గుతున్న తెలంగాణా కార్మికులు
గల్ఫ్ దేశాల్లో కార్మికులుగా పని చేస్తున్న తెలుగువారు అక్కడ వెట్టిచాకిరికి గురవుతున్నారు. యజమానుల హింసకు గురవుతున్నారు.సౌదీలోని దమామ్ పట్టణంలో క్లీనింగ్ వర్క్ ఉందని, మంచి జీతంతో పాటు కంపెనీ వసతి సౌకర్యం కూడా కల్పిస్తుందని ఏజెంట్లు నమ్మించడంతో ఐదేళ్ల క్రితం జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన దాదాపు 400మంది దమామ్కు వెళ్లారు. ఇందుకు ఒక్కొక్కరు రూ.70వేల నుంచి రూ.లక్ష దాకా ఏజెంట్లకు చెల్లించారు. రాష్ట్రానికి చెందిన 30మంది కార్మికులు పని చెయ్యటానికి ఏజెంట్ల ద్వారా వెళ్లారు. అయితే అక్కడ రెండేళ్ళు పని చేసిన వారికి వర్క్ పర్మిట్ రెన్యువల్ చేయకుండా పని చేయించుకున్నారు. ప్రభుత్వానికి జరిమానా కట్టాల్సి రావటంతో వారిని గల్ఫ్లో ఆ కంపెనీ ప్రతినిధులు గదిలో బంధించారు.
ఏజెంట్లు, కంపెనీ మోసాల కారణంగా ఏడాదిగా నిత్యనరకాన్ని అనుభవిస్తున్న కార్మికులు
కడుపునిండా తిండి దొరకదు. తాగేందుకు సరిపడా నీళ్లూ కరువే. విద్యుత్తు కనెక్షన్ లేకపోవడంతో చీకట్లోనే మగ్గుతున్నారు. మంచిగా పనిచేసుకొని, వచ్చే జీతాన్ని ఇంటికి పంపొచ్చని గల్ఫ్ వెళ్లిన బడుగుజీవులు ఇప్పుడు తమ గోడు వినేవారు లేక విలవిలలాడుతున్నారు. ఏజెంట్లు, కంపెనీ మోసాల కారణంగా ఏడాదిగా నిత్యనరకాన్ని అనుభవిస్తున్నారు తెలంగాణాకు చెందిన 30 మంది కార్మికులు . ఇక అక్కడ పని చెయ్యటానికి వెళ్ళిన కార్మికులకు రెండేళ్లకు వర్క్పర్మిట్ ను రెన్యువల్ చేయాల్సి ఉండగా కంపెనీ చేయించలేదు. అదనంగా మరో రెండేళ్లపాటు వర్క్ పర్మిట్ లేకుండానే వారితో పనులు చేయించుకున్నారు. ఇక ఇప్పుడు నాలుగేళ్లకు తప్పనిసరిగా వర్క్పర్మిట్ రెన్యువల్ చేయాల్సి రావడంతో కంపెనీ చేతులెత్తేసింది. ప్రభుత్వానికి జరిమానా చెల్లించాల్సి ఉండడంతో అది కట్టకుండా వారిని వదిలించుకోవాలని చూసింది.
కొంతకాలం జైలుకెళ్ళి స్వదేశానికి చేరుకున్న కొందరు కార్మికులు .. మిగతా వారిని కాపాడాలని వేడుకోలు
దీంతో చాలా మంది కార్మికులు జైలుపాలై కొన్నాళ్లకు ఇంటికి వెళ్లిపోయారు. జగిత్యాల జిల్లాతోపాటు ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి, బోధన్ ప్రాంతాలకు చెందిన దాదాపు 30 మంది ఇంకా కంపెనీకి చెందిన ఓ గదిలో మగ్గుతున్నారు. తెలిసినవారితో డబ్బులు తెప్పించుకుని భారంగా కాలంవెళ్లదీస్తున్నారు. వీరిలో కొందరు అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. తమ వారిని ఎలాగైనా స్వదేశానికి రప్పించే ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను బాధిత కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. మరి వీరిని స్వదేశానికి తీసుకురావటంలో కేసీఆర్ , కేటీఆర్ లు చొరవ చూపిస్తారో లేదో వేచి చూడాలి .
కాపాడే నాధుడి కోసం ఎదురు చూపు .. కుటుంబ సభ్యుల ఆవేదన
ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులకు బాసటగా నిలుస్తామని చెబుతున్నా ఆశించిన మేరకు వారికి సహకారం అందడం లేదన్నది తాజా ఘటనలతో తేటతెల్లమవుతుంది. చాలామంది కుటుంబ సభ్యులు సౌదీకి వెళ్లిన తమ వారి జాడ తెలియడం లేదని ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇక ఈ ముప్పై మండే కాకుండా సౌదీలో, గల్ఫ్ దేశాల్లో నరకం చూస్తున్న కార్మికులకు విముక్తి కల్పించటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.