తెలంగాణ ఎన్నికలు: మళ్లీ 30 ఏళ్ల తర్వాత.. ఫ్యామిలీలో నందమూరి సుహాసిని రికార్డ్!
హైదరాబాద్: నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని మహాకూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సుహాసిని గెలుపుతో పాటు ఆమె బరిలో నిలవడం ద్వారా హైదరాబాద్లో ప్లస్ అవుతుందని, మహాకూటమి అభ్యర్థులకు అనుకూలం అవుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
సుహాసిని నామినేషన్ సందర్భంగా, సోదరుడు హరికృష్ణ మృతిపై నోరు జారిన బాలకృష్ణ
సుహాసిని పోటీ ద్వారా, ఓ విధంగా దాదాపు 30 ఏళ్ల తర్వాత తన తాత నందమూరి తారక రామారావు అడుగుజాడల్లో ఆమె నడిచినట్లుగా చెబుతున్నారు. ఎన్టీఆర్ తర్వాత తెలంగాణ ప్రాంతం నుంచి (ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం) పోటీ చేసిన నందమూరి కుటుంబ సభ్యురాలు సుహాసిని కావడం గమనార్హం.
సుహాసినికి గతంలో కంటే భారీ మెజార్టీ
కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆంధ్రా ఓటర్లు ఎక్కువగా ఉంటారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన కృష్ణారావు తెరాసలో చేరి, ఇప్పుడు అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో కూకట్పల్లి నుంచి టీడీపీ తరఫున పెద్దిరెడ్డి, మందాడి పేర్లను పరిశీలించారు. అనూహ్యంగా సుహాసిని పేరు తెరపైకి వచ్చింది. 2014లో వచ్చిన మెజార్టీ కంటే ఇప్పుడు చాలా ఎక్కువ మెజార్టీ వస్తుందని భావిస్తున్నారు.
అప్పుడు ఎన్టీఆర్ పోటీ
తెలంగాణ నుంచి దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత నందమూరి కుటుంబం నుంచి పోటీ చేస్తున్నారు. అంతకుముందు, 1985, 1989లలో ఎన్టీఆర్ పోటీ చేశారు. ఎన్టీఆర్ 1985లో నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. నల్గొండతో పాటు హిందూపురం, గుడివాడ నుంచి కూడా పోటీ చేశారు. అప్పుడు ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ.. ఇలా మూడు ప్రాంతాల నుంచి పోటీ చేశారు. అప్పుడు మూడుచోట్లా ఆయన గెలిచారు. ఆ తర్వాత నల్గొండ, గుడివాడలకు రాజీనామా చేశారు.
1989లో మరో స్థానం నుంచి ఎన్టీఆర్ పోటీ
ఆ తర్వాత, 1989లో రాయలసీమలోను హిందూపురంతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పుడు ఎన్టీఆర్ కల్వకుర్తి నుంచి తక్కువ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత పలు ఎన్నికల్లో ఎన్టీఆర్ సంతానం జయకృష్ణ, హరికృష్ణ, బాలకృష్ణ, పురంధేశ్వరిలు పోటీ చేశారు. కానీ వీరు సీమాంధ్ర ప్రాంతం నుంచే బరిలోకి దికారు.
సంతానం సీమాంధ్ర ప్రాంతం నుంచి
గతంలో నందమూరి జయకృష్ణ శ్రీకాకుళం లోకసభ స్థానం నుంచి పోటీ చేశారు. లక్ష్మీపార్వతి స్థాపించిన ఎన్టీఆర్ టీడీపీ తరఫున పోటీ చేశారు. ఆ తర్వాత హరికృష్మ, బాలకృష్ణలు హిందూపురం నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. పురంధేశ్వరి రెండుసార్లు లోకసభకు ప్రాతినిథ్యం వహించారు. మొదటిసారి విశాఖపట్నం నుంచి, రెండోసారి బాపట్ల నుంచి గెలిచారు. 2014లో ఓడిపోయారు.