కరోనా: కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకున్న 300 మంది తెలుగు విద్యార్థులు, వేడుకోలు
న్యూఢిల్లీ/కౌలాలంపూర్: కరోనావైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశాల్లో ఉంటున్న భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. అయితే, పలు విమానాశ్రయాలు సేవలను నిలిపివేయడంతో అక్కడి చిక్కుకుపోతున్నారు.
కౌలాలంపూర్ విమానాశ్రయంలో..
ప్రపంచ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడటంతో భారతీయ విద్యార్థులు కూడా స్వదేశానికి వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఫిలిప్పీన్స్లో చదువుకుంటున్న సుమారు 300 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు స్వస్థలాలకు బయల్దేరారు. అయితే, మలేషియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయం వరకు వచ్చిన వారు అక్కడే చిక్కుకుపోయారు.
అటు పోలేం.. ఇక్కడ ఉండలేం..
అయితే, విమానాశ్రయంలోకి రావడానికి మలేషియా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత రాయబార కార్యాల అనుమతి లేనిదే విమానం ఎక్కేందుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో విద్యార్థులు వీడియోలు తీసి కేంద్ర ప్రభుత్వానికి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. మీడియా ద్వారా తమ సమస్యను తెలియజేస్తున్నారు.
ఎవరూ పట్టించుకోవడం లేదంటూ..
సుమారు 300 మంది విద్యార్థులం ఇక్కడ ఉన్నామని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని.. తిరిగి ఫిలిప్పీన్స్ వెళ్లిపోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, స్వస్థలాలకు వెళ్లానుకునేవారు 72 గంటల్లోగా దేశం విడిచివెళ్లాలని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో అక్కడికి కూడా తాము వెళ్లలేని వాపోతున్నారు.
Recommended Video
ఆహారం కూడా లేదంటూ వేడుకోలు..
తమకు తినేందుకు ఆహారం కూడా లేదని చెబుతున్నారు. తమను భారత ప్రభుత్వం వెంటనే స్వదేశానికి తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు. ఆ వీడియోలను చూసిన వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు.