3 వేల ప్రత్యేక బస్సులు.. సిటీ నుంచి పల్లెలకు, ఎప్పటి వరకు సర్వీసులు అంటే..
బతుకమ్మ, దసరా.. తెలంగాణలో పెద్ద పండుగ. దసరా అంటే ప్రాధాన్యం ఇస్తారు. ఇక పండగ సందర్బంగా నగరాలు/ పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లడం మాములే. పండగ సందర్భంగా ఏటా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతూ ఉంటుంది. ఈ సారి కూడా ప్రత్యేక బస్సులను రన్ చేస్తోంది. పండగ కోసం 3 వేల స్పెషల్ బస్సులను నడిపిస్తామని టీఎస్ ఆర్టీసీ తెలిపింది.
హైదరాబాద్ నుంచి జిల్లాలకు 3 వేల ప్రత్యేక బస్సులు నడుపనుంది. ఈ నెల 15వ తేదీన స్పెషల్ సర్వీసులు ప్రారంభమయ్యాయని తెలిపింది. ఈ నెల 24 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతామని రంగారెడ్డి ఆర్ఎం వరప్రసాద్ చెప్పారు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, ఎస్ ఆర్ నగర్, అమీర్పేట్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్రోడ్, ఎల్బీ నగర్ నుంచి బస్సులు బయలుదేరతాయని పేర్కొన్నారు. స్పెషల్ సర్వీస్ కోసం అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకోవచ్చని తెలిపారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ కల్పించామని వరప్రసాద్ ప్రకటించారు. ప్రతీ సంవత్సరం దసరా సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి కూడా ప్రత్యేక బస్సులు నడిపించేవారు. అయితే ఈసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అంత ర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం జరగకపోవడంతో బస్సుల రవాణాకు బ్రేక్ పడింది.
కరోనా వైరస్ నేపథ్యంలో బస్సు సర్వీసులకు చాలా రోజులు బ్రేక్ పడింది. తర్వాతే బస్సులను నడిపిస్తున్నారు. కానీ బస్సులలో ఆశించినస్థాయిలో జనం తిరగడం లేదు. పల్లెటూర్లకు జనం లేకుండానే సర్వీసులు వెళుతున్న సందర్బాలు కనిపిస్తున్నాయి.