ఆస్ట్రేలియాలో డెంటిస్ట్ ప్రీతిరెడ్డి హత్య, సూట్కేసులో మృతదేహం: ప్రమాదంలో మాజీ ప్రియుడు మృతి
మహబూబ్ నగర్/మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారతీయురాలైన ఓ మహిళా డెంటిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమె సిడ్నీలో ఓ ప్రాంతం నుంచి కనిపించకుండా పోయారు. ఆ తర్వాత బుధవారం రోజు ఆమె మృతదేహం లభ్యమైంది. మృతురాలి పేరు ప్రీతిరెడ్డిగా గుర్తించారు. ఈస్టర్న్ సిడ్నీ స్ట్రీట్లోని ఆమె కారు ఓ ప్రాంతంలో పార్క్ చేయబడి ఉంది. ఆ కారులో ఉన్న సూటుకేసులో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
ప్రేమోన్మాది అవినాష్ దాడిలో గాయపడ్డ రవళి చికిత్స పొందుతూ మృతి
ఆస్ట్రేలియాలో తెలంగాణ డెంటిస్ట్ ప్రీతిరెడ్డి హత్య
ఆస్ట్రేలియాలో గత ఆదివారం నుంచి డెంటల్ డాక్టర్ అయిన ప్రీతిరెడ్డి కనిపించకుండా పోయారు. ఇప్పుడు కారులోనే విగతజీవిగా కనిపించారు. ఆమె వయసు 32 సంవత్సరాలు. సిడ్నీలో ఆమె అదృశ్యమైనట్టు కేసు నమోదైంది. ఆ తర్వాత ఆమె కారులోనే ఉన్న సూట్ కేసులో కుక్కిన స్థితిలో ప్రీతిరెడ్డి మృతదేహం కనిపించింది. ఆమె మృతదేహంపై కత్తిపోట్లు ఉన్నాయి. ఆమెను ఎవరు హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
ప్రీతిరెడ్డిది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా
సిడ్నీలోని మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ వద్ద ప్రీతి చివరిసారిగా కనిపించినట్లుగా చెబుతున్నారు. ఆపై టిఫిన్ చేసి వస్తానని చెప్పింది. కానీ రాలేదు. ఆ తర్వాత మిస్సింగ్ కేసు నమోదయింది. ప్రీతి రెడ్డిది తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ప్రీతిరెడ్డి తండ్రి ప్రొఫెసర్గా పని చేశారు. ప్రీతిరెడ్డి ఆదివారం ఓ డెంటల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అదే రోజు ఉదయం పదకొండు గంటలకు తెలంగాణలోని తమ కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
ప్రమాదంలో అతను మృతి
ఇదిలా ఉండగా, ప్రీతి రెడ్డి హత్య కేసును పోలీసులు విచారిస్తుండగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రీతిరెడ్డిని మాజీ ప్రియుడు హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఆ మాజీ ప్రియుడు కూడా న్యూఇంగ్లాండ్ హైవే పైన తన వాహనంలో దూసుకెళ్తూ కారు ప్రమాదానికి గురై మరణించాడు. ప్రీతిరెడ్డి హత్యకు గురైన ప్రాంతానికి 340 కిలో మీటర్ల దూరంలో అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను మరణించడానికి ముందు.. ఆ మాజీ ప్రియుడికి పోలీసులు ఫోన్ చేసి విచారించాల్సి ఉందని చెప్పారు. కానీ అంతలోనే అతను ప్రమాదానికి గురై చనిపోయాడు. వారిద్దరు మధ్య ఏం జరిగిందనే విషయం తెలియాల్సి ఉందని చెబుతున్నారు.